T Fiber: సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని టీ ఫైబర్ అధికారులతో చెప్పారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ నిమిత్తం ఎలాంటి బిల్లులు చెల్లించొద్దని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. 'టీ-స్వాన్' (T-SWAN) నెట్వర్క్ను నెల రోజుల్లోగా టీ-ఫైబర్కు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతిష్టాత్మక 'ఫ్యూచర్ సిటీ'కి కూడా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికి ఇంటర్నెట్' ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారాయన. సచివాలయంలో 'టీ-ఫైబర్'పై మంత్రి శ్రీధర్ బాబు కీలక సమీక్ష నిర్వహించారు. సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు.












