ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఒకేసారి రెండు పరువు హత్యలు సంభవించాయి. కూతురి లవ్ ఎఫైర్ ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలోని కడప నగరంలోని దండోరా కాలనీ మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నకూతురితో పాటు భార్యను సైతం ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
స్థానికుల సమాచారం ప్రకారం..తన కూతురు ఓ యువకుడిని ప్రేమిస్తోందని తెలుసుకున్న తండ్రి పద్ధతి మార్చుకోవాలని బిడ్డకు సూచించినట్టు సమాచారం.ఆమె తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా.. కోపోద్రిక్తుడైన ఆ తండ్రి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత భార్యతోనూ ఇదే విషయంలో గొడవ జరగడంతో ఆమెపై కూడా దాడికి చేసి ప్రాణాలు తీశాడు.
భార్య బిడ్డను హత్య చేసిన అనంతరం ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అరుపుల కారణంగా స్థానికులు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను గుర్తించారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు ఫైల్ చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యల వెనుక కేవలం ప్రేమ వ్యవహారమే కారణామా? లేదా ఇంకేమైనా కోణం ఉందా? అని పొలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.












