రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలాశయంలో మత్స్యకారుల వలకు సుమారు 30కిలోల బరువున్న భారీ బొచ్చ చేప చిక్కింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ ద్వారా ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా వస్తున్న నిరంతర నీటి ప్రవాహంతో పెద్ద పెద్ద చేపలు మిడ్ మానేరుకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన మత్స్యకారుడు రాజ్కుమార్ ఆదివారం వేసిన వలలో ఈ భారీ బొచ్చ చేప పడింది.
గతంలో ఈ ప్రాంతంలో 20 నుంచి 22 కిలోల బరువున్న చేపలు లభ్యమైనప్పటికీ, ఏకంగా 30 కిలోల బొచ్చ చేప లభించడం ఎంతో అరుదని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో శ్రమతో ఒడ్డుకు తెచ్చిన ఈ భారీ చేపను స్థానికులు, జాలర్లు ఉత్సాహంగా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి. నీటి లభ్యత మెరుగుపడటం, వరద కాలువ ద్వారా నిరంతరం నీరు చేరుతుండటంతో మిడ్ మానేరు పరిసరాల్లో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది
మంచినీటి జలాశయాల్లో లభించే ప్రధాన భారతీయ కార్ప్ జాతికి చెందిన ఈ బొచ్చ చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. నీటిపై భాగంలో సంచరిస్తూ వేగంగా పెరిగే ఈ చేపల తల శరీరం కంటే పెద్దగా ఉండటం వీటి ప్రధాన ప్రత్యేకత. చెరువులు, నదులు, రిజర్వాయర్లలో సహజంగా లభించే ప్లాంక్టన్, సూక్ష్మ జీవులను ఆహారంగా తీసుకుంటూ ఇవి వేగంగా ఎదుగుతాయి.
మిడ్ మానేరు, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి వంటి పెద్ద జలాశయాల్లో తగినంత నీటి మట్టంతో పాటు పుష్కలంగా ఆహారం లభించినప్పుడు ఇలాంటి భారీ చేపలు పెరగడం అసాధారణమేమీ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. రుచికరమైన మాంసంతో పాటు అధిక బరువు తూగడం వల్ల బహిరంగ మార్కెట్లో బొచ్చ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని భారీ చేపలు వలకు చిక్కే అవకాశం ఉందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












