హైదరాబాద్ నగర ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకునే విధానానికి త్వరలో గుడ్బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. మెట్రో రైలు తరహాలో ప్రయాణానికి ముందే మొబైల్ యాప్లో టికెట్ కొనుగోలు చేసే అడ్వాన్స్ లేదా బోర్డింగ్ టికెటింగ్ వ్యవస్థను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ కొత్త ఫీచర్ను మీ టికెట్ మొబైల్ యాప్లో ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రయాణికులు ముందుగానే తమ బోర్డింగ్ స్టాప్, గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకుని యూపీఐ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. అనంతరం యాప్లో బస్సు లైవ్ లొకేషన్ను ట్రాక్ చేస్తూ, టికెట్లో చూపించిన సమయానికి బస్సును ఎక్కేలా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 3,200కు పైగా ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ సుమారు 26 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. వీరిలో దాదాపు 70 శాతం మంది మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం లబ్ధిదారులే. అయినప్పటికీ రోజుకు సుమారు రూ.6.5 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వస్తుండగా, అందులో ఇప్పటికే 23 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే సమకూరుతోంది. కొత్త అడ్వాన్స్ టికెటింగ్ విధానం అమల్లోకి వస్తే ఈ డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో బస్సుల్లో నిలబడి టికెట్ తీసుకోవడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. మరోవైపు డిజిటల్ చెల్లింపుల్లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టికెట్ల జారీ ఆలస్యమవుతోంది. దాని ప్రభావం బస్సుల షెడ్యూల్పై కూడా పడుతోంది. ముందుగానే టికెట్ తీసుకునే విధానం అమలైతే కండక్టర్లపై పని భారం తగ్గడమే కాకుండా, ప్రయాణికుల సమయం కూడా ఆదా కానుంది.
ఇదే సమయంలో డిజిటల్ బస్పాస్ వ్యవస్థకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 25న ప్రారంభించిన మీ టికెట్ యాప్ ద్వారా ఇప్పటివరకు 14 వేల మందికి పైగా డిజిటల్ బస్పాస్లు జారీ అయ్యాయి. వీటి ద్వారా రూ.2 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ప్రస్తుతం సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, పుష్పక్ బస్పాస్లతో పాటు టీ-24 టికెట్లు కూడా యాప్లో అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు విద్యార్థుల కోసం కూడా డిజిటల్ బస్పాస్లను అందుబాటులోకి తీసుకురావాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో బస్పాస్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గడంతో పాటు సిబ్బందిపై పని భారం కూడా తగ్గనుంది. మొత్తంగా చూస్తే... టీజీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్న ఈ డిజిటల్ మార్పులు నగర ప్రజలకు మరింత వేగవంతమైన, సులభమైన, ఆధునిక ప్రజా రవాణా సేవలను అందించడంలో కీలకంగా మారనున్నాయి..












