ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భీమ్ రెడ్డికి... భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023 (BNSS) లోని సెక్షన్ 35(3) కింద నోటీసు జారీ చేశారు. అయితే, ఇప్పటి వరకు భీమ్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం, కనీసం జ్యుడిషియల్ కస్టడీకి గానీ, రిమాండ్ కు గానీ పంపక పోవడంపై తబిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కానీ... ఇదే రకమైన ఆరోపణలు ఎదుర్కొన్న తన భర్త అంబేద్కర్ విషయంలో మాత్రం చట్టం భిన్నంగా ఎందుకు వ్యవహరించిందని ప్రశ్నించారు. తన భర్త అంబేద్కర్ దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించారు. అడిగిన ప్రతి రికార్డును, ఆర్థిక వ్యవహారాల పత్రాలను అధికారులకు సమర్పించారు. అయినా సరే... ఆయనను అరెస్ట్ చేసి, ఏకంగా 36 రోజుల పాటు సుదీర్ఘంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు.
రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ఎలాంటి పలుకుబడి లేని ఒక నిరుపేద షెడ్యూల్డ్ కులానికి చెందిన కుటుంబం కావడం వల్లే తమపై ఈ వివక్ష చూపించారా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి మద్దతు లేని సాధారణ పౌరులుగా తాము రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై నమ్మకంతో ఈ బాధను మౌనంగా భరించామని తబిత వాపోయారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం.. ప్రతి పౌరుడికి సమానత్వం, సమన్యాయం, సమాన రక్షణ లభించాలి. ఒకే విధమైన పరిస్థితి ఉన్న మరొక కేసులో నిందితుడికి కల్పించిన విధానపరమైన రక్షణను.. తన భర్త అంబేద్కర్ కు ఎందుకు నిరాకరించారు? చట్టం ముందు సమానత్వం అనేది కేవలం పుస్తకాలకే పరిమితమా? ఆచరణలో సామాన్యుడికి అది ఆదర్శంగానే మిగిలిపోవాలా? అని తబిత ప్రశ్నిస్తున్నారు.
ఈ వివక్ష తమ కుటుంబానికి తీరని మానసిక వేదనను మిగిల్చిందని.. ఆర్థికంగా, సామాజికంగా కోలుకోలేని దెబ్బ తీసిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వేదన నా ఒక్కదానిదే కాదు.. చట్టం సమానంగా అమలు కానప్పుడు, వ్యవస్థల వివక్ష వల్ల లోలోపల నలిగిపోతున్న ఎంతోమంది మహిళల మౌన స్వరం ఇది!" అంటూ తబిత పేర్కొన్నారు.
ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలు తమపై ఉన్న అసమానత ముద్రను తొలగించుకోవాలని.. సమానత్వం, న్యాయబద్ధతను కాపాడి ప్రజల్లో నమ్మకాన్ని బలపరచాలని ఆమె కోరారు. తన భర్త అంబేద్కర్ పై నమోదు చేసిన ఈ తప్పుడు కేసును సమీక్షించాలని... చట్ట ప్రకారం ఆ కేసును ఉపసంహరించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏసీబీ డైరెక్టర్ బ్యూరోను తబిత అభ్యర్థించారు.












