ఈ రోజుల్లో సోషల్ మీడియా మనిషి జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. కానీ అదే వేదికలో చిన్నారుల భద్రతకు ముప్పుగా మారే కంటెంట్ కనిపించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. తాజాగా చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన అనుచిత కంటెంట్ను ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేయడం ఈ సమస్య ఎంత తీవ్రమైందో చూపిస్తోంది.
మరోవైపు మెటా పై ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్రం ఆదేశించింది. థర్డ్ పార్టీ కంటెంట్ అయినప్పటికీ ప్రకటనల ద్వారా మెటాకే ఆదాయం వస్తుంది కాబట్టి.. ఈ ఆరోపణలు నిజమని తేలితే ఆ సంస్థనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది
ప్రస్తుత సమాజంలో పిల్లలు చదువుకోడానికి, వినోదం కోసం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఫోన్ చేతిలోకి తీసుకుంటారు. కానీ అదే సమయంలో అల్గోరిథమ్లు లేదా ప్రకటనల ద్వారా వారికి వయసుకు తగని, హానికరమైన కంటెంట్ కనిపిస్తే? అది వారి మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
అందుకే డిజిటల్ ప్రపంచంలో బాధ్యత అనేది కేవలం తల్లిదండ్రులదే కాదు, సోషల్ మీడియా సంస్థలదీ కూడా. సోషల్ మీడియా వేదికపై హానికరమైన ప్రకటనలు లేదా కంటెంట్ కనిపిస్తే, ఇది థర్డ్ పార్టీది అని చెప్పడం సరిపోదు. ఆ వేదికను నిర్వహిస్తున్న సంస్థ కూడా బాధ్యత తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే వేగంగా భద్రతా ప్రమాణాలు కూడా బలోపేతం కావాలి. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ చోటు ఉండకూడదని, సురక్షితమైన సోషల్ మీడియా వాతావరణాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వం, సాంకేతిక సంస్థలు, తల్లిదండ్రులు, సమాజం.. అందరూ కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే పిల్లలకు నిజమైన డిజిటల్ భద్రతను అందించగలమంటున్నారు నిపుణులు..












