శ్రీలంకతో జరగనున్న కీలకమైన టెస్ట్ సిరీస్కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టు సహాయక సిబ్బందిలో ముఖ్యమైన మార్పులు చేసింది. టీమిండియా నూతన ఫీల్డింగ్ కోచ్గా సుభదీప్ ఘోష్ను నియమించగా, ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న టి.దిలీప్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్-శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి గాలె వేదికగా తొలి టెస్టుతో ద్విపాక్షిక సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో రెండో టెస్టు జరుగుతుంది. ఈ పర్యటనకు ముందు భారత జట్టు ఆగస్టు 7 నుంచి కొలంబోలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుండగా, ఈ సిరీస్ నుంచే సుభదీప్ ఘోష్ తన బాధ్యతలను ప్రారంభించనున్నారు.
57 ఏళ్ల సుభదీప్ ఘోష్కు కోచింగ్లో విస్తృతమైన అనుభవం ఉంది. గతంలో రెండేళ్లపాటు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా పనిచేసి, 2022 వన్డే ప్రపంచకప్, 2023 టీ20 ప్రపంచకప్లలో జట్టుతో కలిసి పనిచేశారు. అంతేగాక ఇండియా 'ఏ' జట్లకు, అసోం సీనియర్ పురుషుల జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించిన ఘోష్, ఆటగాడిగా అసోం, రైల్వేస్ తరఫున చెరో 17 ఫస్ట్-క్లాస్, లిస్ట్ 'ఏ' మ్యాచ్లు ఆడారు.
ఇంతకుముందు ఫీల్డింగ్ కోచ్గా ఉన్న టి.దిలీప్ కాంట్రాక్ట్ ముగియడంతో బీసీసీఐ దానిని పునరుద్ధరించలేదు. ఆయన 2021 నుంచి 2025 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వరకు, ఆ తర్వాత 2025 ఇంగ్లండ్ పర్యటనకు పనిచేశారు. మరోవైపు జట్టు సహాయక కోచ్గా ఉన్న ర్యాన్ టెన్ డెస్కాటె కూడా తన పదవి నుంచి తప్పుకుని, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్లో 'హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ'గా కొత్త బాధ్యతలు చేపట్టారు.
గత ఏడాది నవంబర్లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ ఆడిన తర్వాత, భారత్ ఆడబోతున్న తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నూతన ఫీల్డింగ్ కోచ్ నియామకం, జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు, మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.












