టూరిజం, ఉద్యోగాల పేరుతో భారతీయులపై వల..
థాయ్లాండ్లో వెలుగుచూస్తున్న దారుణాలు
థాయిలాండ్ ట్రిప్కు వెళ్లే ముందు జాగ్రత్త
థాయ్లాండ్ అంటే అందరికీ గుర్తొచ్చేది తెల్లని ఇసుక తీరాలు, నీలి సముద్రం, సందడిగా ఉండే బ్యాంకాక్, రంగురంగుల నైట్లైఫ్. ప్రతి ఏడాది లక్షలాది మంది భారతీయులు సెలవుల కోసం ఈ దేశాన్ని ఎంచుకుంటారు. మరికొందరు మంచి ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కోసం అక్కడికి వెళ్తారు. కానీ అదే థాయ్లాండ్ ఇప్పుడు కొంతమంది భారతీయులకు భయానక అనుభవాల కేంద్రంగా మారుతోంది. పర్యాటకం, ఉద్యోగాల పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తున్న అంతర్జాతీయ నేర ముఠాల వ్యవహారం రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ఈ ప్రమాదం ఎంత తీవ్రమైందో చూపించింది. తక్కువ ఖర్చుతో థాయ్లాండ్ టూర్ అని నమ్మించి ముగ్గురు భారతీయులను బ్యాంకాక్కు తీసుకెళ్లిన ఓ ముఠా.. వారిని పట్టాయాలోని ఓ ఇంటిలో వారం రోజుల పాటు బంధించినట్లు దర్యాప్తులో బయటపడింది. కుటుంబ సభ్యుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసేందుకు బాధితులను చిత్రహింసలకు గురిచేసినట్లు, వీడియో కాల్స్ ద్వారా బెదిరింపులు చేసినట్లు అధికారులు గుర్తించారు.
బాధితుల కుటుంబ సభ్యులు వెంటనే థాయ్ పోలీసులను ఆశ్రయించడంతో ప్రత్యేక బృందం దాడి చేసి ముగ్గురినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేశారు. అందులో భారతీయులు కూడా ఉండటం మరింత సంచలనంగా మారింది. విదేశాల్లో భారతీయులనే లక్ష్యంగా చేసుకుని.. భారతీయులే నేరాలకు పాల్పడుతున్నారనే విషయం తీవ్ర చర్చకు దారితీసింది.
థాయిలాండ్ అంత డేంజరా..?
గత కొన్నేళ్లుగా థాయ్లాండ్ పేరు చెప్పి జరుగుతున్న మోసాల సంఖ్య పెరుగుతోందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్ మెసేజ్లు, నకిలీ ఉద్యోగ వెబ్సైట్లు, పరిచయస్తుల పేరుతో వచ్చే ఆఫర్లు... ఇవే ఇప్పుడు నేర ముఠాల ప్రధాన ఆయుధాలుగా మారాయి. నెలకు రెండు లక్షల జీతం, ఫ్రీ వీసా, ఉచిత విమాన టికెట్, అనుభవం అవసరం లేదు వంటి ప్రకటనలతో యువతను ఆకర్షిస్తున్నారు.
థాయ్లాండ్కు చేరుకున్న తర్వాత అసలు కథ మొదలవుతోంది. ఉద్యోగం అక్కడ కాదని.. మరో దేశానికి వెళ్లాలని చెబుతూ బాధితులను మయన్మార్ సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ పాస్పోర్టులు లాక్కొని బయటకు వెళ్లకుండా బంధించి.. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడే సైబర్ స్కామ్ కేంద్రాల్లో పని చేయాలని బలవంతం చేస్తున్నట్లు అనేక దర్యాప్తుల్లో వెల్లడైంది. పని చేయకపోతే కొట్టడం, ఆహారం ఇవ్వకపోవడం, కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించడం వంటి అమానుష ఘటనలు కూడా నమోదయ్యాయి.
మహిళలనూ వదలడం లేదు
ఈ మోసాలు పురుషులకే పరిమితం కావడం లేదు. మహిళలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. హోటల్, రెస్టారెంట్, స్పా, రిసెప్షనిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి థాయ్లాండ్కు తీసుకెళ్లి.. అక్కడ పాస్పోర్టులు స్వాధీనం చేసుకుని అక్రమ కార్యకలాపాల్లోకి నెట్టినట్లు పలు కేసుల్లో ఆరోపణలు ఉన్నాయి. బయటకు వస్తే కుటుంబ సభ్యులకు హాని చేస్తామని బెదిరించడం, మానసికంగా వేధించడం వంటి ఆరోపణలు కూడా నమోదయ్యాయి.
అయితే ఈ పరిస్థితిని చూసి థాయ్లాండ్ మొత్తం ప్రమాదకర దేశమని భావించడం సరైంది కాదు. లక్షలాది మంది భారతీయులు అక్కడ సురక్షితంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగి వస్తున్నారు. కానీ నకిలీ ట్రావెల్ ఏజెంట్లు, అక్రమ రిక్రూట్మెంట్ ముఠాలు, అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండటం మాత్రం చాలా అవసరం.
విదేశాలకు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉద్యోగం ఇస్తున్న కంపెనీ నిజమైనదేనా లేదా అధికారిక వెబ్సైట్లో ధృవీకరించాలి. ట్రావెల్ ఏజెంట్కు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. పాస్పోర్ట్, వీసా వంటి అసలు పత్రాలను ఎవరికి అప్పగించకూడదు. ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయం, స్థానిక పోలీసుల సంప్రదింపు వివరాలను ముందుగానే భద్రపరచుకోవడం మంచిది.












