CJP: రాజకీయ పార్టీగా కాక్రోచ్ జనతా పార్టీ? అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన
CJP: కాక్రోచ్ జనతా పార్టీని త్వరలోనే రాజకీయ పార్టీగా మారుస్తారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై అభిజీత్ దీప్కే స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేపీని రాజకీయ పార్టీగా మార్చే అవకాశం ఇప్పట్లో లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ప్రజలకు రాజకీయ పార్టీలపై నమ్మకం పోయిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరో పొలిటికల్ పార్టీకి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశానికి ఉద్యమాలే అవసరం అన్నారు. నీట్ పేపర్ లీక్ తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారాన్ని కేంద్రం ఇంకా చెల్లించలేదన్నారు. మరింత ఆలస్యం చేస్తే దీనిపై మళ్లీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
''ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం ప్రస్తుతానికి మాకు లేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మరో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం సమంజసం కాదు. మాకు అటువంటి ఉద్దేశం ఏమీ లేదు. ED, CBIలను ఉపయోగించి రాజకీయ పార్టీలు ఎలా చీలిపోతున్నాయో మనం చూస్తున్నాం. ఎన్నికల్లో ఓట్లను తొలగిస్తున్నారు. ప్రజలకు రాజకీయాలపై నమ్మకం సన్నగిల్లిన ఈ తరుణంలో, కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మనం సాధించేది ఏముంటుంది?" అని అభిజీత్ దీప్కే అన్నారు.
''ప్రజల విశ్వాసానికి సంబంధించిన ఆందోళనలు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. న్యాయవ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, మీడియాపై కూడా ప్రజలు నమ్మకం కోల్పోతున్న తీరును చూస్తుంటే, ఈ దేశానికి ఒక ప్రజా ఉద్యమం అవసరమనిపిస్తోంది. నీట్ ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకపోతే మళ్లీ నిరసన బాట పట్టొచ్చు. ఆత్మహత్య చేసుకున్న NEET-UG అభ్యర్థుల కుటుంబాలకు నిరసనకారులు డిమాండ్ చేసిన కోటి రూపాయల పరిహారం ఇంకా అందలేదు'' అని అభిజీత్ అన్నారు.












