అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో పోషకుడిగా ఉన్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత భయ్యాజీ జోషిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. విరాళాల చోరీ ఘటన అనంతరం చేపట్టిన సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.
అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన భయ్యాజీ జోషి.. ఆరోగ్య కారణాల వల్లే తాను స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు. మరోవైపు రామ జన్మభూమి ప్రాజెక్టుకు సంబంధించిన భూముల కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో భయ్యాజీ జోషిని ట్రస్ట్ పోషకుడిగా నియమించారు. అయితే జోషి బహిరంగంగా పెద్దగా కనిపించనప్పటికీ.. ట్రస్ట్ తీసుకునే నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూన్నారని తెలుస్తుంది.
ఇక 2009 నుంచి 2021 వరకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జోషి పనిచేశారు. మరోవైపు విరాళాల చోరీ అంశంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే.. సొమ్ము కాజేసిన నిందితుల నుంచి ఆలయ ట్రస్ట్ కొంత మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుందనే ప్రచారం జరుగుతుంది. కాగా విరాళాల దొంగతనంపై జరిపిన అంతర్గత తనిఖీల్లో సుమారు రూ.80లక్షల విలువైన నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం..
ఈ క్రమంలో ఆలయ ట్రస్టు పరిపాలనాపరమైన పనితీరుకు సంబంధించిన పలు అంశాలను పరిశీలించడానికి ఈ కేసులో మరో ప్రత్యేక దర్యాప్తు బృందం అయిన సిట్ ను ప్రభుత్వం ఎంటర్ చేసింది. ఇక దేశ వ్యాప్తంగా విరాళాల చోరీ అంశంపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జోషి రాజీనామా పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది.












