గురుపౌర్ణమి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మహారాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత నానా పటోలే పాల్గొన్నారు. కాగా, సోఫాలో కూర్చున్న ఆయన పాదాలను ఇద్దరు యువకులు పాలు, నీళ్లతో కడిగి, పూలు, పండ్లతో పూజించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో, ప్రతిపక్ష నాయకుల వీఐపీ విధానం, రాచరిక మనస్తత్వంపై నెటిజన్లు, రాజకీయనాయకులు పెద్ద ఎత్తున స్పందించడం మొదలుపెట్టారు.
ఈ వ్యవహారంపై మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, మంత్రి చంద్రశేఖర్ బవాన్కులే తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న భూస్వామ్య మనస్తత్వానికి, వారి పార్టీ 'సంస్కృతి'కి ఈ ఘటనే సజీవ నిదర్శనమని ఎద్దేవా చేశారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, ప్రజాక్షేత్రంలో ప్రజలు అసహ్యించుకునే ఇలాంటి పనులకు పాల్పడటం వల్ల ప్రతికూల ప్రచారం తప్ప కాంగ్రెస్కు ఏమీ దక్కదని ఆయన విమర్శించారు.
అయితే, బీజేపీ విమర్శలను నానా పటోలే తీవ్రంగా ఖండించారు. ఆ రోజు గురుపౌర్ణమి కావడం వల్ల తన స్వంత కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు నన్ను గురువుగా భావించి గౌరవసూచకంగా ఆ పూజ చేశారే తప్ప, ఎవరినీ బలవంతం చేయలేదని వివరణ ఇచ్చారు. ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదని, భక్తిపూర్వకంగా చేసిన పనికి రాజకీయ రంగు పులమడం సరికాదని స్పష్టం చేశారు.
తనపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలపై పటోలే ఎదురుదాడికి దిగారు. తమకు సంస్కృతి, సాంప్రదాయాల గురించి పాఠాలు చెప్పే అర్హత బీజేపీకి లేదన్నారు. చందాల రూపంలో నిధులను దోచుకునే అలవాటున్న బీజేపీ నాయకులు నీతులు మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. గురుపౌర్ణమి వేడుక సాకుగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు వేదికగా మారింది.












