శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది ప్రస్తుత సమాజంలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
రోజువారీ విధుల్లో భాగంగా రాత్రి సమయంలో ఇంటి నుంచి క్యాబ్లో బయల్దేరిన ఇండిగో ఉద్యోగిని.. తనను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన డ్రైవర్ నుంచే ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి క్యాబ్ను మళ్లించిన డ్రైవర్.. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని సమాచారం.
ఈ ఘటనపై బాధితురాలు శంషాబాద్ ఎయిర్పోర్టు ఔట్పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే.. ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళకు రోడ్డుపై భద్రత ఉందా? క్యాబ్లో భద్రత ఉందా? కార్యాలయంలో భద్రత ఉందా? అనే సందేహాలు పలువురు లేవనెత్తుతున్నారు.. ఒకప్పుడు ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు.. పక్కన ఉన్న వ్యక్తి నుంచే ప్రమాదం ఎదురవుతుందనే భయం నెలకొంది.
ఇది కేవలం ఒక మహిళ ఎదుర్కొన్న సమస్య కాదు. రాత్రి వేళ విధులకు వెళ్లే వేలాది మంది మహిళల భద్రతకు సంబంధించిన అంశం. తమ కుటుంబ సభ్యులు ఉద్యోగాల కోసం బయటకు వెళ్లినప్పుడు.. వారు సురక్షితంగా తిరిగి వస్తారా లేదా అనే ఆందోళన ప్రతి కుటుంబంలోనూ కనిపిస్తోంది. మహిళల భద్రత కోసం కేవలం ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా.. క్యాబ్ డ్రైవర్ల పూర్తి స్థాయి వెరిఫికేషన్, వాహనాల నిరంతర ట్రాకింగ్, అత్యవసర సమయంలో వెంటనే స్పందించే భద్రతా వ్యవస్థలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
లేకపోతే.. ఎంత సాంకేతిక అభివృద్ధి సాధించినా.. మనిషిని మనిషి నమ్మలేని పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయి. భద్రత కోసం బయటకు వెళ్లిన ప్రతి వ్యక్తి.. తిరిగి ఇంటికి చేరే వరకు భయంతో జీవించాల్సిన పరిస్థితి మారాలి. ఇది కేవలం పోలీసుల బాధ్యత కాదు.. రవాణా సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం, సమాజం మొత్తం కలసి పరిష్కరించాల్సిన సమస్యగా లోకం పరిగణిస్తుంది.












