రాష్ట్రాన్ని ముసుగు కమ్మేసింది. తెలంగాణ వ్యాప్తంగా గత రెండ్రోజులుగా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. పలుచోట్ల మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నట్టు సమాచారం.అయితే,బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడిందని, త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖపేర్కొంది. ఇదిలాఉండగా, ప్రస్తుతం ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు.
ఈ ముసురు మరో రోజూ కొనసాగుతుందని తెలిపారు. ఉత్తర, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో మేఘాలతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, అసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రి సమయంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
అదేవిధంగా సెంట్రల్ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణతెలంగాణ జిల్లాల్లో సాయంత్రం సమయంలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని, ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సాయంత్రం నుండి రాత్రి వరకు చినుకులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతంలో నిన్న జోరు వర్షం కురిసింది. కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు పడ్డాయి.రాత్రి కూడా కొన్ని ఏరియాల్లో వర్షం కురిసింది.నేటి ఉదయం నుంచే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు ప్రారంభం అయ్యాయి. దీనికి తోడు చల్లటి గాలులు వీస్తుండటంతో భయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు.












