ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు సైతం ఒకటో తారీఖును వేతనాలు చెల్లించాలన్న సీఎం ఆశయం నీరుగారుతున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే కొందరు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉపాధి హామీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదని తెలిసింది. రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటే మిగతా వారికి జీతాలు ఒకేసారి చెల్లించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసి మరీ అధికారులను ఆదేశించారు. అయినా వారిలో మార్పు కనిపించడం లేదని సమాచారం.
అసలు విషయానికొస్తే .. ఉపాధి హామీ సిబ్బందికి 3 నెలలుగా జీతాలు రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించే కీలక బాధ్యతను చేపట్టే ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు రావడం లేదు. చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్న సిబ్బందికి 3 నెలలు గడిచినా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా భారింది. ‘వీబీ జీ రామ్ జీ’ పథకం అమలు కోసం రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సుమారు 12 వేల మంది వరకు పని చేస్తున్నట్టు సమాచారం.
కూలీలకు పనులు కల్పించడం మొదలు.. వారి అటెండెన్స్ వేయడం, పేర్ల నమోదు, పని ప్రదేశంలో ఫోటోలు తీయడం, కొలతలు తీసుకోవడం, పనుల చెప్పడం, కూలీల వివరాలు ఆన్లైన్లో ఎంటర్ చేయడంలో వీరంతా కీలక పాత్ర పోషిస్తారు. అయితే, వీరికి సకాలంలో వేతనాలు అందడం లేదు. గతంలో 10వ తేదీలోగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యేవి.కానీ, 3 నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.
జీతాలు ఎప్పుడు వస్తాయని అడిగితే ఉన్నతాధికారుల నుంచి సరైన సమాచారం కొరవడింది. సాంకేతిక కారణాల పేరిట తప్పించుకుంటున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు కట్టడానికి అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. సర్కార్ స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












