డీఎస్పీ భీమ్రెడ్డికి ఏసీబీ వెసులుబాటు
ఆరోగ్య కారణాలు చూపించడంతో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద నోటీసులు జారీ
‘ఎక్స్’లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శలు
పేదలకు ఓ న్యాయం అగ్రవర్ణాలకు ఓ న్యాయమా? అని నిలదీత
ఏసీబీకి పైస్థాయి ఒత్తిడి వచ్చిందా? అని ప్రశ్నలు
వందల కోట్ల అవినీతికి పాల్పడిన డీఎస్పీ భీమ్రెడ్డి వ్యవహారంలో ఏసీబీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుడిని, బడుగు బలహీన వర్గాల వారిని చిన్న తప్పులకే రోడ్డుపైకి ఈడ్చే వ్యవస్థలు.. వందల కోట్ల అవినీతికి పాల్పడిన అగ్రవర్ణాల అధికారుల ముందుకు వచ్చేసరికి సాగిలపడుతున్నాయా? అనే ప్రశ్నలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి.
వందల కోట్ల అవినీతి సొమ్ముతో దొరికిన సదరు అధికారికి బీఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చి పంపించడం వెనుక ఏసీబీ చూపిన కారణంపై పలు ప్రశ్నలకు తావిస్తోంది. అవినీతి కేసుల్లో దొరకగానే పెద్ద పెద్ద అధికారులకు, అగ్రవర్ణాల ప్రముఖులకు మాత్రమే ఈ 'ఆరోగ్య కారణాలు' ఎందుకు గుర్తుకొస్తాయి? ఒక పేదవాడో, బడుగు బలహీన వర్గాల వాడో చిన్న దొంగతనానికో, లేక చిన్న గొడవకో పట్టుబడితే వాడికి అనారోగ్య సమస్యలు ఉండవా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఏసీబీ అనుసరించిన ఈ ద్వంద్వ వైఖరిని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’ (ట్విట్టర్) లో ఆయన సంధించిన ప్రశ్నలు వ్యవస్థల వివక్షపై మండిపడ్డారు. "భారీగా ఆస్తులు దొరికిన భీమ్రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరు పరచలేదు? అంత ఒత్తిడి ఎవరి నుంచి వచ్చింది?" అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, అంతటి అవినీతిపరుడిని స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలంటూ పైస్థాయి నుంచి ఏసీబీ అధికారులపై తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు.
డీఎస్పీ భీమ్రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులను పెద్ద ఎత్తున కూడబెట్టారనే పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏకకాలంలో ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన పలు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. రూ.300 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులు, ఇంట్లోనే 2 కిలోల బంగారం, ఏకంగా 20 కిలోల వెండిని అధికారులు సోదాల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.












