మనిషి జీవితాలను ఆన్లైన్ ప్రపంచం సులభతరం చేసినప్పటికీ.. కొత్త తరహా నేరాలకు వేదికగా మారుతోంది. ముఖ్యంగా అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ మోసగాళ్లు.. వారి అవసరాలను అదనుగా తీసుకుని కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
తాజాగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసులు ఈ ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి యువతతో బ్యాంకు ఖాతాలు తెరిపించడం, ఆ ఖాతాలను అక్రమ లావాదేవీలకు వినియోగించడం వంటి చర్యలు ఇప్పుడు పెద్ద నేర ముఠాల వ్యూహంగా మారాయి.
ఇలాంటి ఖాతాలను "మ్యూల్ అకౌంట్లు"గా ఉపయోగిస్తూ.. ఆన్లైన్ మోసాల ద్వారా దోచుకున్న సొమ్మును ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మళ్లిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దర్యాప్తు సంస్థలకు అసలు నేరస్థులను గుర్తించడం సవాలుగా మారుతోంది.
మరోవైపు ఈ మోసాలతో రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఈ కేసులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు కావడం.. ఈ మోసాల వెనుక ఉన్న నెట్వర్క్ను ఛేదించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని సూచిస్తోంది.
నేటి సమాజంలో నిరుద్యోగం, త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ, డిజిటల్ అవగాహన లోపం వంటి అంశాలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అందుకే ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు లేదా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చినప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవడం అత్యంత అవసరమని అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.
అయినా చాలా వరకు తెలియక చేసిన చేస్తున్న ఈ చిన్న పొరపాటు కూడా పెద్ద కేసుల్లో చిక్కుకునే పరిస్థితిని తీసుకురావచ్చు. అందుకోసం సైబర్ మోసాలపై అప్రమత్తతే అసలైన రక్షణ అని, ప్రతి పౌరుడు డిజిటల్ భద్రతపై అవగాహన పెంచుకుంటేనే ఇలాంటి ముఠాల ఆటలు కట్టడి చేయడం సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు..
ఇక హైదరాబాద్ వేదికగా సాగుతున్న ఈ మ్యూల్ ఖాతాల నెట్వర్క్ ఎంత భయంకరంగా ఉందంటే, కేవలం ఒక్క బాధితుడినే కాదు, దేశవ్యాప్తంగా వందల మందిని ఈ ముఠా బురిడీ కొట్టిస్తోంది. స్టాక్ మార్కెట్, ఐపీఓ పెట్టుబడుల పేరుతో అమాయకుల ఆశలను పెట్టుబడిగా మార్చుకొని కోట్లు కొల్లగొడతుంది.
ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. పెట్టుబడుల పేరుతో వచ్చే తెలియని వాట్సాప్ గ్రూప్ ఇన్విటేషన్లను అసలు నమ్మొద్దని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సెబీ అనుమతి లేని యాప్స్ లేదా వెబ్సైట్స్లో డబ్బులు డిపాజిట్ చేయడం ప్రమాదం అని తెలుపుతున్నారు..












