బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు అంశం రాజకీయాల్లో తీవ్ర చర్చలతో నిత్యం విమర్శలకు అడ్డాగా మారింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ విషయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇందులో అవినీతి జరిగిందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తూ కోర్టు వరకు వెళ్ళగా.. ప్రభుత్వానికి చేతగాక, ప్రణాళిక లేక నిందలు వేస్తూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తుందని బిఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అయితే తాజాగా తెలంగాణ హైకోర్టు ఈ వివాదం పై కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సుందిళ్ల పంప్హౌస్ల భద్రతపై చేపట్టిన సమగ్ర సాంకేతిక అధ్యయనం వివరాలను సమర్పించాలని ఆదేశించింది..
మరోవైపు న్యాయవాది ఎస్.శరత్.. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి బుధవారం విచారించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటన తర్వాత ప్రాజెక్టు భద్రతకు సంబంధించిన ముందస్తు చర్యలు అత్యవసరమని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ తనిఖీ అనంతరం చేసిన సిఫార్సులను అమలు చేయడంలో విఫలమైందని, దీనివల్ల నీటి వృధాతో పాటు ప్రాజెక్టు నిర్మాణ భద్రత కూడా దెబ్బతింటోందని తన వాదనను వినిపించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్హౌస్ల నిర్మాణ స్థితిపై సమగ్ర అధ్యయనం చేపట్టకుండా రాజకీయ చర్చలకే పరిమితమవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
నీటి ప్రవాహం తగ్గడం వల్ల నిర్మాణాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని, దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీని ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా పునరుద్ధరించాలని కోరారు.. అదేవిధంగా మిగిలిన నిర్మాణాల విషయంలో కూడా ఎన్డీఎస్ఏతో స్వతంత్ర సాంకేతిక అధ్యయనం నిర్వహించి గడువులోగా నివేదిక సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.
ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్రం, ఎన్డీఎస్ఏ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంజనీర్-ఇన్-చీఫ్తో పాటు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్కు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాలలో చర్చాంశనీయంగా మారింది.












