దేశంలోని కోట్లాది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల నిరీక్షణకు ముగింపు పలికేలా ఈపీఎఫ్వో వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేయాలంటే ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
క్లెయిమ్ దాఖలు చేసిన తర్వాత వారాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్ల పరిశీలన, సాంకేతిక సమస్యలు, కార్యాలయాల మధ్య సమన్వయ లోపం కారణంగా క్లెయిమ్లు మరింత ఆలస్యమయ్యేవి. ఉద్యోగులు తమ డబ్బు ఎప్పుడు వస్తుందోనని రోజూ స్టేటస్ చెక్ చేసుకునే పరిస్థితి ఉండేది.
కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో నేటి నుంచే కొత్త డిజిటల్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంలో రూ.5 లక్షల వరకు ఉండే అర్హత కలిగిన పీఎఫ్ క్లెయిమ్లు 'ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్' ద్వారా ఆటోమేటిక్గా ఆమోదం పొందనున్నాయి.
అంటే ప్రతి క్లెయిమ్ కోసం ఎక్కువ కాలం మాన్యువల్ పరిశీలన అవసరం లేకుండా, ప్రక్రియ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకో పెద్ద మార్పు ఏమిటంటే... దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పీఎఫ్ ఖాతాలను ఇప్పుడు ఒకే డేటాబేస్లోకి తీసుకువచ్చారు. ఉద్యోగి ఏ రాష్ట్రంలో పనిచేసినా, ఎక్కడికి బదిలీ అయినా... తన పీఎఫ్ వివరాలను ఒకే ప్లాట్ ఫామ్లో సులభంగా చూసుకోవచ్చు.
దీంతో డేటా నిర్వహణ సులభమవడమే కాకుండా, సేవల వేగం కూడా గణనీయంగా పెరగనుంది. అంతేకాదు... జూలై 15 నాటికి ఖాతాల్లో జమ అయిన మొత్తానికి ప్రభుత్వం అందించే పీఎఫ్ వడ్డీ జమ చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
మొత్తానికి... గతంలో వారాల పాటు ఎదురు చూపులు... ఇప్పుడు రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్. గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి... ఇప్పుడు ఒకే డిజిటల్ డేటాబేస్తో వేగవంతమైన సేవలు. ఈపీఎఫ్వో తీసుకొచ్చిన ఈ మార్పులు కోట్లాది ఉద్యోగులకు సమయం, శ్రమ రెండింటినీ ఆదా చేయడంతో పాటు, పీఎఫ్ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా మార్చనున్నాయని చెప్పవచ్చు.












