రాష్ట్రంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరణే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరివెళ్లారు. ఈ పర్యటనలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామిని వారు కలుస్తారని సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా కోరుతారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖానాపూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు కేంద్రమంత్రితో సమావేశం అవుతారని సమాచారం.
ఆ తర్వాత ఢిల్లీలో నిర్వహించే మీడియా మీట్లో నాయకులు పాల్గొనున్నారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1984 నుంచి పనిచేసి 1998లో కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. రూ.2వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని పునరుద్దరించి 3వేల మందికి ఉపాధి కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత కేసీఆర్ హాయంలోనూ సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదు. ఈ క్రమంలోనే మరోసారి బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
కాగా, బీఆర్ఎస్ హయాంలోనే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేంద్రం రీఓపెన్ చేయడంతో ప్రస్తుతం అక్కడ ఎరువుల ఉత్పత్తి జరుగుతోంది.దేశవ్యాప్తంగా యూరియాను ఎఫ్సీఐ సరఫరా చేస్తున్నది. సుమారు రూ.8వేల కోట్ల వ్యయంతో ఎరువుల కార్మాగారాన్నిపునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఆనాడు బీఆర్ఎస్ ఎంపీలు పలుమార్లు రిక్వెస్ట్ చేయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు, స్తానికుల డిమాండ్ మేరకు కేంద్రమంత్రికి వినతిపత్రం అందించేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.












