కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను తన సొంతూరు కిర్లంపూడికి తరలించారు. అక్కడే ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని అనుచరులు, కాపు నేతలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు.
ఈ క్రమంలోనే కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కన్నతండ్రిని చివరి చూపు చూసేందుకు వచ్చిన కూతురు క్రాంతిని ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. మొదట పత్తిపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ముద్రగడ కూతురు క్రాంతి విజ్ఞప్తితో నివాళులు అర్పించేందుకు అనుమతించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన వివాదంలో నేను చనిపోతే కూతురు రావొద్దని చెప్పిన ముద్రగడ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో క్రాంతి గో బ్యాక్ అంటూ ఆమెను ముద్రగడ అనుచరులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది.
https://x.com/TeluguScribe/status/2077243394385117358?s=20
కాగా, గత ఎన్నికల సమయంలో తన తండ్రికి వ్యతిరేకంగా క్రాంతి వ్యవహరించారని నాడు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ముద్రగడ ఇంటికి పలువురు రాజకీయ ప్రముఖులు, కాపు ఉద్యమ కీలక నేతలు వస్తున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ కూడా ఆయన పార్ధివదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతారని సమాచారం.












