సీఎం రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విప్ లుగా ఉన్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పించింది. ఈ మేరకు అధికారులు ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఏప్రిల్ లోనే అప్పటి సీఎస్ రామకృష్ణారావు పేరుతో జీవో తయారు అవ్వగా.. అదే జీవోను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్టికల్ 18 ప్రకారం కేబినెట్ హోదా కలిగిన వ్యక్తులకు ఎలాంటి ప్రొటోకాల్, సౌకర్యం ఉంటుందో వీరికి అదే హోదా వర్తించనుంది. కానీ వీరు కేబినెట్ భేటీలో కూర్చోరు. కేవలం ఒక మంత్రికి ఎలాంటి సౌకర్యాలు, అధికారాలు ఉంటాయో అదే హోదాలో కొనసాగుతారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అద్దంకి దయాకర్ పాత్ర చాలా కీలకమైంది. సీఎంవ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరు ఉంది.గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పారని ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా తన సీటును త్యాగం చేశాడు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయనకు ఎమ్మెల్సీని ఇచ్చి గౌరవించారు సీఎం.. తాజాగా మంత్రి హోదాను సైతం కల్పించారు.
ఇక బల్మూరి వెంకట్ విద్యార్థి నాయకుడిగా ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశాడు. జైలుకు కూడా వెళ్లారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించాడు. నిత్యం కాంగ్రెస్ కోసం పనిచేస్తూ పార్టీని ముందుకు నడిపించాడు. నాడు రేవంత్ నిర్వహించిన ప్రతి సభలోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు భవిష్యత్ లీడర్లకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు పదవులు దక్కుతాయని కాంగ్రెస్ మరోసారి నిరూపించిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎమ్మెల్సీ పూర్తి పదవీకాలం పాటు మంత్రి హోదా అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ అయ్యాయి.












