తెలంగాణ

హైదరాబాద్ చుట్టూ రేవంత్‌ చక్కర్లు.. అసలు లెక్కేంటి?

రచన: Kashi11 నిమిషాల పఠనం

రేవంత్‌ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్‌పై ఇంత ఫోకస్ పెంచడానికి కేవలం అభివృద్ధే కారణమా? లేక ముందున్న గ్రేటర్‌ రాజకీయ సమరానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

3 కార్పొరేష‌న్లు.. 3 లోగోలు

గ్రేట‌ర్ వార్‌కు సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌భుత్వం

రేవంత్ హైద‌రాబాద్ టూర్ల వెనుక లెక్కేంటి..?

గ్రేటర్‌ గేమ్‌ మొదలైందా?

హైదరాబాద్‌ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేవలం రాజధాని కాదు.. అధికారానికి దారి చూపించే అతిపెద్ద రాజకీయ వేదిక. అందుకే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏ చిన్న రాజకీయ కదలిక జరిగినా.. దాని వెనుక ఎన్నికల లెక్క ఉందా? అనే చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుసగా హైదరాబాద్‌ అభివృద్ధి పనులపై ఫోకస్ పెంచుతుండటం కూడా అలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది. ఒకవైపు ఫ్లైఓవర్లు, రోడ్లు, బ్రిడ్జిలు, మూసీ అభివృద్ధి.. మరోవైపు కొత్తగా మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి కొత్త లోగోలు. ప్రభుత్వం మాత్రం ఇవన్నీ పరిపాలనా సౌలభ్యం, నగర విస్తరణకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలంటోంది. కానీ రాజకీయంగా చూస్తే.. గ్రేటర్ గేమ్‌ మొదలైందా? అన్న ప్రశ్న మాత్రం తప్పదు.

ఫ్లైఓవర్ల వెనుక క‌థేంటి..?

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య కొత్తది కాదు. కానీ ఇప్పుడు నగరంలోని కీలక జంక్షన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్‌ పార్క్ పరిసరాల్లో H-CITI కింద భారీ మౌలిక వసతుల పనులు చేపడుతున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ సహా పలు నిర్మాణాలు రానున్నాయి. మొత్తం H-CITI ప్రాజెక్టులో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లు ప్రతిపాదించారు.

ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు. హైదరాబాద్‌లో రోజూ ప్రయాణించే లక్షలాది మందికి నేరుగా కనిపించే అభివృద్ధి పనులు. అంటే ఎన్నికలకు ముందు ఒక ప్రభుత్వం ప్రజల ముందు తన పనితీరును చూపించుకోవాలంటే.. రోడ్లు, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం వంటి అంశాలు చాలా వేగంగా కనిపించే ఫలితాలు.

అందుకే రేవంత్‌ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్‌పై ఇంత ఫోకస్ పెంచడానికి కేవలం అభివృద్ధే కారణమా? లేక ముందున్న గ్రేటర్‌ రాజకీయ సమరానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

మూసీ.. ఇప్పుడు పొలిటికల్ ప్రాజెక్టా?

రేవంత్‌ ప్రభుత్వ అజెండాలో మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్టు చాలా కీలకం. మూసీని పునరుజ్జీవింపజేసి 55 కిలోమీటర్ల కారిడార్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే మొదటి దశ పనులు కొనసాగుతున్నాయి. రెండో దశను నాగోలు నుంచి గౌరెల్లి వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది.

ఇటీవల మూసీపై ముసారాంబాగ్‌ హై లెవల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ సమస్యను తగ్గించే దిశగా ఈ బ్రిడ్జి కీలకమని ప్రభుత్వం చెబుతోంది. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రెండో దశ పనులకు టెండర్లు పిలవడం, ల్యాండ్‌ పూలింగ్‌ పాలసీపై కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం ద్వారా ప్రాజెక్టుకు మరింత వేగం ఇవ్వాలని చూస్తోంది.

ఇక్కడే మరో రాజకీయ లెక్క కనిపిస్తోంది. మూసీని అభివృద్ధి చేస్తే హైదరాబాద్‌ రూపురేఖలు మారుతాయని కాంగ్రెస్ చెబుతోంది. కానీ అదే సమయంలో మూసీ చుట్టూ ఉన్న భూసేకరణ, పునరావాసం, ఖర్చు వంటి అంశాలు రాజకీయంగా సున్నితమైనవి. అంటే రేవంత్‌ ప్రభుత్వానికి మూసీ అభివృద్ధి అస్త్రం మాత్ర‌మే కాదు.. రాజకీయ సవాల్ కూడా.

మూడు కార్పొరేషన్లు.. మూడు లోగోలు.. ఎన్నికల సంకేతమా?

ఇప్పుడు అసలు ట్విస్ట్‌ ఇదే.

గ్రేటర్‌ హైదరాబాద్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం.. తాజాగా GHMC, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లకు కొత్త లోగోలను ఆవిష్కరించింది. ప్రభుత్వం దీనిని కొత్త పరిపాలనా వ్యవస్థకు కొత్త గుర్తింపుగా చెబుతోంది. నగరం విస్తరిస్తున్నందున పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే లక్ష్యమని వివరణ ఇస్తోంది. అది అధికారిక కారణం. కానీ రాజకీయ కారణం ఏంటి?

3 లోగోలు.. 3 కొత్త రాజకీయ మ్యాపులు

ఇప్పటివరకు GHMC పేరుతో ఒకే పెద్ద రాజకీయ యూనిట్‌గా ఉన్న హైదరాబాద్‌.. ఇప్పుడు మూడు కార్పొరేషన్లుగా విడిపోయింది. అంటే భవిష్యత్‌లో మూడు వేర్వేరు రాజకీయ పోరాటాలు. మూడు వేర్వేరు స్థానిక నాయకత్వాలు. మూడు వేర్వేరు ఎన్నికల వ్యూహాలు. అందుకే మూడు లోగోలు ఆవిష్కరించడాన్ని కేవలం లోగో లాంచ్‌గా చూడలేం. కొత్త వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రక్రియలో ఇది ఒక కీలక అడుగు.

ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు?

గ్రేటర్‌ ఎన్నికల ముందు రేవంత్‌ మార్క్‌ వేయాలనుకుంటున్నారా? హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు ప్రజలకు కనిపించాలి. కొత్త కార్పొరేషన్లు పనిచేస్తున్నాయన్న భావన రావాలి. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు అందుబాటులోకి రావాలి. మూసీ ప్రాజెక్టు ముందుకు కదులుతోంది అన్న సందేశం వెళ్లాలి. ఇవి అన్నీ కలిపి చూస్తే ఒక రాజకీయ వ్యూహం కనిపించక మానదు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు అన్ని పార్టీల‌కు చాలా కీలకం. హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు గతంలో బలమైన పట్టు ఉంది. బీజేపీ కూడా నగరంలో తన ప్రభావాన్ని పెంచుకుంది. కాంగ్రెస్‌ మాత్రం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా.. గ్రేటర్‌లో తన బలాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

అందుకే రేవంత్‌ ప్రభుత్వానికి హైదరాబాద్‌ ఇప్పుడు కేవలం పరిపాలనా బాధ్యత కాదు. ఇది రాజకీయంగా గెలవాల్సిన మరో పెద్ద ఫ్రంట్.

అభివృద్ధి ఓటుగా మారుతుందా?

ఇక్కడే అసలు పరీక్ష. ఫ్లైఓవర్‌ కట్టడం ఒకటి. దానిని ఓటుగా మార్చుకోవడం మరోటి. బ్రిడ్జి ప్రారంభించడం ఒకటి. ఆ బ్రిడ్జి వల్ల నిజంగా ప్రజల ట్రాఫిక్ కష్టాలు తగ్గాయా అన్నది మరోటి. మూసీ ప్రాజెక్టుకు శంకుస్థాపనలు, టెండర్లు, పనులు చేయడం ఒకటి. అది పూర్తయి హైదరాబాద్‌కు కొత్త రూపం రావడం మరోటి. అందుకే రేవంత్‌ ప్రభుత్వం ఇప్పుడు పనులు మొదలయ్యాయి అనే దశ నుంచి పనులు పూర్తయ్యాయి అనే దశకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే అభివృద్ధి రాజకీయంగా ఫలితమిస్తుంది. కానీ ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితి చూస్తే ఈ ప‌నుల‌న్నీ స‌కాలంలో పూర్తి చేయ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వానికి అంత ఈజీ ఏం కాదు. ప్ర‌తి అడుగులో రేవంత్‌కు స‌వాళ్లు త‌ప్ప‌వు. ఇదే ఇప్పుడు అత్యంత కీల‌కం.

బీఆర్ఎస్‌.. బీజేపీ ఏం చేస్తాయి?

రేవంత్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ అభివృద్ధిని తన ప్రధాన అజెండాగా మార్చుకుంటే ప్రతిపక్షాలకు కూడా సవాల్ తప్పదు. బీఆర్ఎస్‌ హైదరాబాద్‌లో తన గత పాలనను గుర్తు చేయాల్సి ఉంటుంది. ఈ పనులకు బీజం వేసింది మేమే అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రారంభమైన అనేక ప్రాజెక్టులను కొనసాగిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో చెప్పారు. అదే సమయంలో హైదరాబాద్‌ మౌలిక వసతులకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

బీజేపీకి మరో లెక్క ఉంది. కేంద్ర ప్రాజెక్టులు, మెట్రో, రోడ్లు, ఫ్లైఓవర్ల విషయంలో కేంద్రం పాత్రను ముందుకు తెచ్చే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్‌లో రాబోయే ఎన్నికల ప్రచారం ఎవరు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు? అనే క్రెడిట్ వార్‌గా మారే అవకాశముంది.

3 లోగోలు.. గ్రేటర్‌ గేమ్‌కు తొలి సిగ్నలా?

ఇప్పటివరకు చూస్తే ప్రభుత్వం మాత్రం మూడు కార్పొరేషన్ల ఏర్పాటు పరిపాలనా సౌలభ్యం కోసమేనని చెబుతోంది. అది అధికారికంగా సరైన వివరణే. కానీ రాజకీయాల్లో టైమింగ్‌ కూడా చాలా ముఖ్యం.

మూడు కొత్త కార్పొరేషన్లు, కొత్త లోగోలు, ఫ్లైఓవర్లపై వేగం, మూసీ ప్రాజెక్టుకు కొత్త దశ, కొత్త బ్రిడ్జిల ప్రారంభాలు, హైదరాబాద్‌లో భారీ మౌలిక వసతుల పనులు.. ఇవన్నీ ఒకేసారి కదులుతున్నప్పుడు.. గ్రేటర్‌ ఎన్నికల మూడ్‌ మొదలైందని రాజకీయంగా చ‌ర్చించుకోవ‌డం స‌హ‌జ‌మే.

#Greater Hyderabad#GHMC Elections#Revanth Reddy#Telangana Politics#Hyderabad Politics#Congress#BRS#BJP#AIMIM#Greater Hyderabad Elections#Telangana Elections#Hyderabad Development#GHMC#Cyberabad#Malkajgiri#Hyderabad News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి