తనకు బెయిల్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదనే మనస్తాపంతో ఓ రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న జైలు అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని చంచల్ గూడ జైలులో వెలుగుచూసింది.కాగా, ఖైదీ మరణంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిపై సమీక్షిస్తున్నట్టు సమాచారం.
వివరాల్లోకివెళితే.. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఘటనలో కంది సాగర్(31)ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్లో భాగంగా చంచల్ గూడ జైలుకు తరలించారు.అయితే, తనకు బెయిల్ ఇప్పించాలని బాధితుడు తన భార్యను వేడుకున్నట్టు సమాచారం. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది జైలులోనే వాష్ రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.
ఖైదీని కాపాడేందుకు జైలు అధికారులు తీవ్రంగా యత్నించినట్టు సమాచారం. బాధితుడిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, మార్గంమధ్యలో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు పేర్కొన్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, రిమాండులో ఉన్న ఖైదీ మరణించిన విషయాన్ని వారి కుటుంబసభ్యులకు పోలీసులు చేరవేసినట్టు సమాచారం. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.












