ఏపీలో పోలీసులు కాల్పులు జరపడం ప్రస్తుతం సంచలనంగా మారింది.ఓ నిందితుడిని పట్టుకునే క్రమంలో అతను ఎదురు తిరగడంతో పాటు కత్తితో దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రాణభయంతో తమను తాము రక్షించుకునే క్రమంలో పోలీసులు నిందితుడి మీద కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే..నిన్న దేవరపల్లి వద్ద ఓ కానిస్టేబుల్పై దాడి చేసి అవినాశ్ అనే వ్యక్తి పరారయ్యాడు.నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు కంకిపాడు వద్ద ఉన్నట్టు సమాచారం లభించింది. రాత్రి 11 గంటల సమయంలో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా...సీఐలు, కానిస్టేబుళ్లపై రాళ్లు, కత్తితో సదరు యువకుడు దాడికి యత్నించినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో అవినాశ్ కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని అక్కడి నుంచి క్షేమంగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, మిగతా వారిపైనా దాడికి అవినాశ్ ప్రయత్నించగా.. తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. అతని కాళ్లపై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.









