హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను గుర్తు తెలియని దుండుగులు ఎత్తుకెళ్లారు. పటాన్చెరు పరిధిలోని పోచారం శివారులో గల సాయి దర్శన్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.నిందితుల కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకివెళితే.. సాయి దర్శన్ కాలనీలో 17 ఏళ్ల బాలిక స్థానికంగా వాచ్మెన్గా పనిచేస్తున్నది. అక్కడే స్థానికంగా తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. అయితే, గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు నిన్న అర్ధరాత్రి బాలిక ఉంటున్న గుడిసెలోకి చొరబడినట్టు సమాచారం. అడ్డుకోబోయిన బాలిక తల్లిదండ్రులపై కర్రలు, బీర్ సీసాలతో దాడికి యత్నించినట్టు తెలిసింది.
అంతేకాకుండా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాలిక చిన్న చెల్లిపై కూడా దాడి చేసి.. మైనర్ను బలవంతంగా ఎత్తుకెళ్లినట్టు తెలిసింది.
అయితే, సమాచారం అందగానే రంగంలోకి దిగిన పటాన్చెరు పోలీసులు.. స్థానికంగా గల సీసీ కెమెరాల సాయంతో బాలికను గుర్తించి సురక్షితంగా రక్షించినట్టు తెలిసింది. అనంతరం బాలికను భరోసా సెంటర్కు తరలించినట్టు సమాచారం. బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మహ్మద్ అలీమ్ పాషా (24)గా పోలీసులు గుర్తించారు. అతని వెంట ముద్దం రాజు, వడ్డే రాజేష్ సైతం ఉన్నట్లు నిర్దారణకు వచ్చారు. పరారీలో ఉన్న నిందితుల కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని పటాన్చెరు సీఐ రవీందర్రెడ్డి తెలిపారు.










