National

జీడీపీ 7.8% వృద్ధి.. సామాన్యుడికి ఒరిగిందేమిటి?

రచన: Kashi12 నిమిషాల పఠనం

జీడీపీ 7.8 శాతం పెరిగిందంటే ప్రతి భారతీయుడి జీతం కూడా 7.8 శాతం పెరిగిందని కాదు. ఇదే విషయాన్ని కేంద్రం ప్రజలకు మరింత స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్న సమయంలో.. ఒక సామాన్య కుటుంబం పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి అద్దె, కిరాణా, వైద్యం, ప్రయాణ ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలో ఆలోచిస్తోంది.

7.8 శాతం జీడీపీ వృద్ధి సాధించిన భార‌త్

దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని అభినంద‌న‌లు

వృద్ధి ఓకే.. కానీ పేద‌రికం ప‌రిస్థితేంటి..?

దేశం ధనికమవుతుంటే.. ప్ర‌జ‌లు పేద‌లుగా మారుతున్నారా..?

అస‌లు గ్యాప్ ఎక్క‌డుంది..?

కేంద్ర ఆర్థిక విధానాలు మారాల్సిన అవ‌స‌రం లేదా..?

జీడీపీ పెరిగింది.. కానీ ఎవరి జీవితం మారింది?

7.8 శాతం.. ఈ సంఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో ఉన్నా భారత్‌ 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించిందని కేంద్రం గర్వంగా చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భారతీయుల సమష్టి కృషికి ఇది నిదర్శనమని అంటున్నారు. సంతోషించాల్సిందే. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంటే ప్రతి భారతీయుడూ గర్వపడాల్సిందే. కానీ.. ఈ 7.8 శాతం వృద్ధి సామాన్యుడి జీవితంలో ఎక్కడ కనిపిస్తోంది? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. జీడీపీ పెరిగిందని టీవీల్లో వార్తలు వస్తున్నాయి. కానీ సామాన్యుడి ఇంట్లో మాత్రం ఖర్చుల లెక్క పెరుగుతోంది. నెల జీతం వస్తోంది.. పది రోజుల్లోనే ఖాళీ అవుతోంది. నెలాఖరుకు ఏదో ఒక అప్పు చేయాల్సి వస్తోంది. మరి ఇదేనా ఆర్థిక వృద్ధి?

లెక్కల్లో వృద్ధి.. జీవితంలో ఎందుకు లేదు?

జీడీపీ అంటే దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం విలువ. అది పెరిగితే ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయని అర్థం. కానీ జీడీపీ 7.8 శాతం పెరిగిందంటే ప్రతి భారతీయుడి జీతం కూడా 7.8 శాతం పెరిగిందని కాదు. ఇదే విషయాన్ని కేంద్రం ప్రజలకు మరింత స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్న సమయంలో.. ఒక సామాన్య కుటుంబం మాత్రం పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి అద్దె, కిరాణా, వైద్యం, ప్రయాణ ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలో ఆలోచిస్తోంది. ఆదాయం పెరిగినా ఖర్చులు ఇంకా వేగంగా పెరిగితే.. జేబులో మిగిలేది ఏముంటుంది? జీడీపీ పెరిగింది.. కానీ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటే చేతిలో మిగిలే ఆదాయం ఎంత పెరిగింది? దీనికి సమాధానం కావాలి.

ఉద్యోగం లేని యువతకు 7.8% ఏం చెబుతుంది?

దేశంలో లక్షలాది మంది యువత ప్రతిరోజూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. డిగ్రీలు ఉన్నాయి. టెక్నికల్‌ కోర్సులు ఉన్నాయి. స్కిల్స్‌ ఉన్నాయి. కానీ సరైన జీతంతో స్థిరమైన ఉద్యోగం దొరకడం మాత్రం పెద్ద సవాల్‌గా మారుతోంది. ఉద్యోగం దొరికినా జీతం కుటుంబ ఖర్చులకు సరిపోవడం లేదు. మరికొందరు తాత్కాలిక ఉద్యోగాలతో నెట్టుకొస్తున్నారు. ఇంకొందరు గిగ్‌ వర్క్‌ చేస్తున్నారు. అలాంటి యువకుడి ముందు 7.8 శాతం జీడీపీ వృద్ధి అనే గణాంకం పెడితే.. అది ఎంతుంటే నాకేంటి అని ఎదురు ప్ర‌శ్నిస్తాడు.

ఇదే కేంద్రాన్ని అడగాల్సిన ప్రశ్న. ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతోందంటే ఆ వృద్ధి ఎన్ని కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది? పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి అని చెబుతున్నారు. కానీ వాటికి అనుగుణంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు ఎందుకు కనిపించడం లేదు? ఆర్థిక వృద్ధి ఉద్యోగాలు సృష్టించకపోతే.. ఆ వృద్ధి ఎవరి కోసం? మధ్యతరగతి.. సంపాదించేది ఎక్కువా? ఖర్చు చేసేది ఎక్కువా?

ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా చెప్పుకునే మధ్యతరగతి కుటుంబాన్ని చూడండి. జీతం వస్తుంది. వెంటనే ఇంటి అద్దె, ఈఎంఐ, పిల్లల ఫీజులు, కరెంట్ బిల్లు, రవాణా, కిరాణా, వైద్యం.. ఇలా ఒక్కొక్కటి జీతాన్ని మింగేస్తాయి. చివరికి పొదుపు చేయడానికి ఏమీ మిగలదు. అత్యవసర పరిస్థితి వస్తే క్రెడిట్ కార్డు లేదా అప్పు మీద ఆధారపడాల్సిందే.

ఇది కేవలం ఒక కుటుంబం సమస్య కాదు. వినియోగం తగ్గితే మార్కెట్‌ దెబ్బతింటుంది. మార్కెట్‌ దెబ్బతింటే చిన్న వ్యాపారాలు ఇబ్బందుల్లో పడతాయి. వ్యాపారం తగ్గితే ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. ఉద్యోగాలు తగ్గితే ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే వినియోగం మరింత పడిపోతుంది.

అంటే ఆర్థిక వ్యవస్థకు అసలు ఇంధనం అయిన సామాన్యుడి కొనుగోలు శక్తి బలంగా ఉండాలి. మరి ఆ కొనుగోలు శక్తిని పెంచడానికి కేంద్రం చేస్తున్నది ఏమిటి?

చిన్న వ్యాపారి పరిస్థితి ఏంటి?

ఒక చిన్న దుకాణం నడిపే వ్యక్తిని అడగండి. రోజంతా షాపులో కూర్చుంటాడు. కస్టమర్లు తగ్గారు. అద్దె మాత్రం ఆగదు. కరెంట్ బిల్లు ఆగదు. సరుకుల ధరలు మారుతూనే ఉంటాయి. ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి. బ్యాంకు రుణం ఉంటే ఈఎంఐ కట్టాలి. చివరికి చేతిలో మిగిలేది ఎంత?

దేశంలో పెద్ద కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించడం ఒక విషయం. కానీ కిందిస్థాయిలో ఉన్న చిన్న వ్యాపారి బతకగలగడం మరో విషయం.

సామాన్యుడి కొనుగోలు శక్తి పెరిగితేనే చిన్న వ్యాపారికి కస్టమర్ వస్తాడు. కస్టమర్ వస్తేనే వ్యాపారం పెరుగుతుంది. వ్యాపారం పెరిగితేనే మరొకరికి ఉద్యోగం వస్తుంది. అందుకే ఆర్థిక వ్యవస్థను పై నుంచి మాత్రమే చూడకూడదు. కిందిస్థాయిలో ప్రజల జేబులను కూడా చూడాలి.

‘వోకల్ ఫర్ లోకల్’.. కానీ కొనడానికి డబ్బు ఉందా?

ప్రధాని మోదీ ‘వోకల్ ఫర్ లోకల్’కు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిస్తున్నారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ తగ్గించాలని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని చెబుతున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ఇది ఉపయోగపడే ఆలోచనే. కానీ ఇక్కడ కూడా ఒక ప్రశ్న తప్పదు.

లోకల్‌ కొనండి అని ప్రజలకు చెబుతున్నారు.. మరి లోకల్‌ కొనడానికి ప్రజల చేతిలో డబ్బు ఎంత ఉంది? ఒక కుటుంబం దగ్గర నెలాఖరుకు డబ్బు మిగలకపోతే.. అది విదేశీ వస్తువు కొంటుందా, దేశీయ వస్తువు కొంటుందా అన్నది అసలు సమస్య కాదు. కొనుగోలు చేసే సామర్థ్యమే లేకపోవడం అసలు సమస్య.

అందుకే ‘వోకల్ ఫర్ లోకల్’తో పాటు ‘వోకల్ ఫర్ ఇన్‌కమ్’, ‘వోకల్ ఫర్ జాబ్స్’, ‘వోకల్ ఫర్ పర్చేజింగ్ పవర్’ కూడా అవసరం కాదా? ఇదీ కేంద్రం ఆలోచించాల్సింది.

ప్రభుత్వం ఆర్థిక వృద్ధి గణాంకాలను చూపించవచ్చు. విదేశీ పెట్టుబడులు పెరిగాయని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్లు పెరిగాయని చెప్పొచ్చు. దేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని చెప్పొచ్చు. కానీ సామాన్యుడి ఇంట్లో మాత్రం ఒక చిన్న లెక్క ఉంటుంది.

నెలకు ఎంత సంపాదించాను? ఎంత ఖర్చు చేశాను? ఎంత అప్పు చేశాను? ఎంత మిగిలింది?

ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే.. 7.8 శాతం వృద్ధి సామాన్యుడి జీవితంలో ఎంతవరకు అర్థవంతం? కేంద్రం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

వృద్ధి ఎవరి కోసం?

భారత్‌ ఎదగాలి. వేగంగా ఎదగాలి. ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక శక్తిగా ఎదగాలి. అందులో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ వృద్ధి కొద్దిమంది చేతుల్లో సంపదను పెంచి, కోట్లాది మంది చేతుల్లో ఖర్చులను మాత్రమే పెంచితే.. దాన్ని సమ్మిళిత ఆర్థిక వృద్ధి అని ఎలా చెప్పాలి?

దేశం కోసం పెద్ద నెంబ‌ర్లు అవసరమే. కానీ ప్రజల కోసం పెద్ద అవకాశాలు ఇంకా అవసరం. ఇది మ‌ర్చిపోవ‌ద్దు. జీడీపీ పెరగాలి. అదే సమయంలో వేతనాలు పెరగాలి. ఉద్యోగాలు రావాలి. చిన్న వ్యాపారాలు వృద్ధి చెందాలి. ప్రజల పొదుపులు పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలి. అప్పుల భారం తగ్గాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే జీడీపీ వృద్ధి సామాన్యుడి జీవితంలోకి వచ్చిందని చెప్పగలం.

7.8 శాతం సంతోషమే.. కానీ ప్రశ్నించాల్సిందే!

7.8 శాతం వృద్ధిని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. అది దేశానికి మంచి సంకేతమే. కానీ ఆ సంఖ్యను ప్రశ్నించకూడదని చెప్పడం మాత్రం సరైంది కాదు. ప్రభుత్వం చెప్పే జీడీపీ లెక్క ఒకటి. ప్రజల జేబులోని లెక్క మరొకటి.

దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా బలపడిందా లేదా అన్నది స్టాటిస్టిక్స్‌ పుస్తకాల్లో మాత్రమే కాదు.. కిరాణా దుకాణంలో, చిన్న వ్యాపారి షాపులో, ఉద్యోగం కోసం తిరిగే యువకుడి చేతిలో, నెలాఖరులో మధ్యతరగతి కుటుంబం బ్యాంక్‌ బ్యాలెన్స్‌లో కూడా కనిపించాలి.

అందుకే కేంద్రాన్ని ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇదే. 7.8 శాతం జీడీపీ వృద్ధి సాధించాం అంటున్నారు. సరే.. మరి సామాన్యుడి ఆదాయం ఎంత పెరిగింది? ఎన్ని మంచి ఉద్యోగాలు వచ్చాయి? ఎన్ని చిన్న వ్యాపారాలు బలపడ్డాయి? ఎంత కొనుగోలు శక్తి పెరిగింది? చివరికి.. ఒక సామాన్య భారతీయుడి జేబులో ఎంత డబ్బు మిగిలింది?

జీడీపీ పెరిగింది సరే.. సామాన్యుడికి ఒరిగిందేమిటి? ఈ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాల్సిందే.

#India GDP#GDP Growth#7.8 Percent GDP#Indian Economy#Narendra Modi#Modi Government#Economic Growth#Unemployment India#Inflation India#Poverty India#Middle Class#Indian Economy 2026#GDP vs Common Man#Economic Policies#India News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి