రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పార్టీ నడుమ మాటల యుద్ధం నడుస్తోంది.అది కాస్త చేజారిపోయి పార్టీ ఆఫీసులు, నేతల ఇళ్ల మీద దాడుల వరకు వెళ్లింది.నిన్న నల్గొండ జిల్లాలో బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. అదే విధంగా, నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. అనంతరం ఆఫీసు మెయిన్ డోర్ మీద నల్ల ఇంకు చల్లారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ శ్రేణుల దాడులను నిరసిస్తూ బీజేపీ ఇవాళ నల్గొండ టూర్కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావును ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినట్టు సమాచారం. తార్నాకలోని నివాసంలో రామచంద్ర రావును పోలీసులు గృహ నిర్భందం చేశారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ ఇంటిపై నిన్న దాడి జరిగిన విషయం తెలిసిందే. ముందుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంప్ ఆఫీస్పై బీజేపీ శ్రేణులు కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేశారు.
అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మతో పాటు ఫ్లెక్సీని దహనం చేశారు.దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వర్గం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి ఇంటిని ముట్టడించింది. ఆయన ఇంట్లోకి చొరబడిన కాంగ్రెస్ నాయకులు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే రామచంద్రరావు నల్గొండ వెళ్లాలని నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ముందుగానే అప్రమత్తమై ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు మంత్రి కోమటిరెడ్డి సైతం నల్గొండలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు సమాచారం.












