Malavika Mohanan: మాళవిక మోహనన్..ఎన్నో ఆశలు పెట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకొచ్చింది. ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. భారీ ప్రాజెక్ట్..పేరున్న దర్శకుడు (మారుతి). కానీ, మొదటి సినిమా ఈ హాట్ బ్యూటీకి ఏమాత్రం కలిసి రాలేదు..తెలుగులో ఆశించిన అవకాశాలు తెచ్చిపెట్టలేదు. ఆ సినిమానే ది రాజాసాబ్.
తమిళంలో మాస్టర్ సినిమాతో బాగా ఆకట్టుకుంది మాళవిక మోహనన్. మోడల్గా సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్శించిన మాళవిక..ముందుగా మలయాళ సినిమా 'పట్టం పోల్'తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ సినిమా 'నాను మట్టు వరలక్ష్మి'లో అవకాశం దక్కించుకుంది. మలయాళంలో రెండు సినిమాలు, ఒక కన్నడ సినిమా..ఆ వెంటనే ఓ హిందీ సినిమా..ఇలా వరుసగా ఆఫర్స్ అందుకుంది. మంచి పర్ఫార్మర్ అనిపించుకుంది.
దాంతో, తమిళంలో మాస్టర్ ఆ తర్వాత, తెలుగులో ది రాజాసాబ్ సినిమాలలో అవకాశాలు అందుకుంది. రాజాసాబ్ హిట్ అయి ఉంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ, ముగ్గురు హీరోయిన్స్లో ఒకరిగా ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర కావడంతో కెరీర్ డైలమాలో పడింది. అయితే, తాజా సమాచారం మేరకు ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీలో ఛాన్స్ దక్కించుకుందట.
మాస్ మహారాజ్ రవితేజ-శ్రీవిష్ణు కలిసి చేస్తున్న సినిమాలో శ్రీవిష్ణు కి జంటగా మాళవిక మోహనన్ ఎంపికైందట. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మిస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్ రవితేజ సరసన ఎంపికైనట్టుగా తెలుస్తోంది. హసిత్ గోలి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. 2027, సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, ది రాజాసాబ్ తర్వాత ఇక టాలీవుడ్ నుంచి అవకాశాలు రావనుకున్న మాళవికకి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది నిజమే అయితే..గొప్ప అవకాశమే అనుకోవాలి.












