హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి జాతీయ స్థాయిలో సరికొత్త గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ 'ఫార్చ్యూన్ ఇండియా' తాజాగా ప్రకటించిన 2026 ఏడాదికి గానూ '100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్' (100 మంది అత్యంత ప్రభావశీల మహిళలు) జాబితాలో ఆమెకు స్థానం లభించింది. వ్యాపార రంగంలో లీడర్షిప్ వహిస్తూ, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను విజయవంతమైన బాటలో నడిపిస్తున్నందుకు గాను ఆమెకు ఈ అరుదైన గుర్తింపు దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష ముద్ర వేసిన మహిళా మూర్తులతో కూడిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో బ్రాహ్మణి చోటు సంపాదించడం విశేషం.
తన భార్య సాధించిన ఈ అద్భుత విజయంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో బ్రాహ్మణి నిలవడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందంటూ ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో అడ్డంకులను అధిగమిస్తూ భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయ శిఖరాలను చేరాలని, అలాగే ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ లోకేశ్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం తన కోడలి ఘనతను ప్రత్యేకంగా అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు బ్రాహ్మణి యొక్క అంకితభావానికి, నాయకత్వ పటిమకు దక్కిన నిదర్శనమని ఆయన కొనియాడారు. ఆమె తమ కుటుంబానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలనుకునే తెలుగు ఆడబిడ్డలందరికీ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోందని చంద్రబాబు ప్రశంసించారు. భవిష్యత్తులో ఆమె చేపట్టబోయే అన్ని వ్యాపార, సామాజిక ప్రయత్నాలు విజయవంతం కావాలని సీఎం ఆకాంక్షించారు.












