లండన్లోని ప్రతిష్ఠాత్మక సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ టెన్నిస్ మ్యాచ్ను వీక్షించేందుకు భారత టెస్టు, వన్డే జట్ల సారథి శుభ్మన్ గిల్కు నిర్వాహకుల నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా రాయల్ బాక్స్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలిలతో కలిసి గిల్ సందడి చేశాడు. వీరిద్దరి పక్కనే కూర్చొని మ్యాచ్ను ఆస్వాదిస్తున్న గిల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
గతంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై అతిథులుగా మెరిశారు. 2013 లోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ను వింబుల్డన్ నిర్వాహకులు ప్రత్యేకంగా ‘క్రికెట్ రాయల్టీ’ అని సంబోధించడం విశేషం. కాగా, ఇదే రాయల్ బాక్స్లో వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా కూడా ప్రత్యేక అతిథిగా విచ్చేసి మ్యాచ్ను వీక్షించాడు.
ఇటీవలి కాలంలో శుభ్మన్ గిల్ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో తరచూ కనిపిస్తున్నాడు. వింబుల్డన్ కంటే ముందే సిల్వర్స్టోన్ సర్క్యూట్లో జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా-1 రేసును కూడా అతను ప్రత్యేక అతిథిగా వీక్షించాడు. ఆ సమయంలో రేసింగ్ ప్యాడక్ను సందర్శించిన గిల్, ఫార్ములా-1 రేసింగ్ ప్రముఖులతో ముచ్చటించి అక్కడి ఉత్సాహభరిత వాతావరణాన్ని ఎంజాయ్ చేశాడు. ఇదిలా ఉండగా, సచిన్ కుమార్తె సారా టెండూల్కర్తో గిల్ ప్రేమాయణంలో ఉన్నాడంటూ గతంలో వచ్చిన రూమర్లపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించకపోయినప్పటికీ, ఇప్పుడు సచిన్ పక్కనే గిల్ కనిపించడంతో నెటిజన్లు ఆ పాత విషయాలను మళ్లీ నెమరువేసుకుంటున్నారు.












