హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది ప్రభుత్వ స్థలాలు, నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తే వారి అంతు చూస్తుంది హైడ్రా..జేసీబీల ద్వారా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తుంది. తాజాగా హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
సోమాజిగూడ రాజ్భవన్ రోడ్డులో సదరు సంస్థ నిర్మిస్తున్న 17 అంతస్తుల నివాస సముదాయానికి మంజూరు చేసిన నిర్మాణ అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. దీనిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రదీప్ కన్స్ట్రక్షన్కు హైడ్రా (HYDRAA) నోటీసులు ఇవ్వడాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని అన్నారు.
హైడ్రా ఒక అడుగు వెనక్కు వేసినా తాను 10 అడుగులు ముందుకెళ్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రదీప్ నిర్మాణ సంస్థ చేపట్టిన నిర్మాణాలు హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఆనాడే చెప్పినా.. నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ పెడచెవిన పెట్టారని ఆరోపించారు. నేడు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కాపాడుకోడానికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా ప్రజలు ఆందోళన చెందవద్దని, బస్తీ ప్రజల ఇళ్లకు ఎలాంటి నష్టం జరగదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.












