ఎల్నినో ప్రభావం తెలంగాణలో తీవ్ర ప్రభావం చూపుతోంది. జులై నెలలో భారీ వర్షాలు కురవాల్సింది. కానీ, అసలు చిరుజల్లులు కూడా పడటం లేదు. ఇప్పటికే రైతులు పంటల సాగు ప్రారంభించేవారు. కానీ, నీళ్లు లేక నారుమడి కూడా పెట్టలేదని తెలుస్తోంది.ఈ ఏడాది పంటల సాగు నెమ్మదిస్తుందని సమాచారం. ఎందుకంటే రాష్ట్రంలో వర్షాలు లేక.. సాగు కోసం నీరు అందడం లేదు. డ్యామ్స్, చెరువుల్లోనూ ఇదే పరిస్థితి. ఎండలకు నీరు మొత్తం అడుగంటిపోతోంది. ఈనెల మొత్తం వర్షాలు లేకపోతే సాగు కాదు కదా? తాగు నీటి ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ఎఫెక్ట్ కనిపిస్తోంది.
ఇదిలాఉండగా, రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు వచ్చింది. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. జూలై 16 నుండి 19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు రాష్ట్రంలో హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని వెల్లడించారు. రేపటి నుంచి రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం మరింత తగ్గుతుందని జూలై 15 నుంచి ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
జూలై 16 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లోనూ విస్తారంగా కురుస్తాయని వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఉన్న వేడి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. రాష్ట్రాన్ని జూన్ మధ్యలోనే రుతుపవనాలు తాకాయి. కానీ, ఇంతవరకు అనుకున్నంత స్థాయిలో వర్షాలు కురియలేదు.ఉత్తర తెలంగాణలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్లో చిరు జల్లులు తప్పా వర్షం జాడలేదు. వర్షాలు లేకపోవడంతో అటు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగు కష్టంగా మారిందని, అప్పుల పాలు అవుతున్నామని ఆందోళన చెందుతున్నారు.












