వర్షాభావ పరిస్థితుల కారణంగా వానలు లేక పంటలు ఎలా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. అన్నదాతలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నాయి. రిటైర్డ్ ఇంజినీర్లు సైతం కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోవయచ్చని చెబుతున్నారు. కానీ, సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారమే నడుచుకుంటామని చెబుతున్నారు. నీళ్లు ఎత్తిపోస్తే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు కొట్టుకుపోతాయని చెబుతున్నారు.దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి నీచమైన భాషను పక్కనపెట్టి సాగునీరు, తాగు నీరు అందించే చర్యలు తీసుకోవాలని సూచించారు. సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలకు 2024లోనే మరమ్మతులు చేసినట్టు ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పిందన్నారు.అందుకే వెంటనే సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీళ్లు స్టోరేజీ చేయాలని సూచించారు.కాళేశ్వరం వద్ద ప్రవాహం అయిపోతే మళ్లీ లిఫ్టింగ్ చేయడానికి పాజిబుల్ కాదన్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతాంగం ఆందోళన చెందుతోందని, తాగు నీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
కనీస అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని.. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఉన్న ఖిలాడీ కమిటీలో ఈటల చేరారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపైనా మండిపడ్డారు. ఖిలాడీ ఈటలనా? రేవంత్ రెడ్డా? అనేది తెలంగాణ సమాజం నిర్ణయిస్తుందని వివరించారు.రేవంత్ రెడ్డి హెడ్ లైన్స్ కోసం మాట్లాడే వ్యక్తి అని ఫైర్ అయ్యారు. రేవంత్ కేవలం రాజకీయకోణంలోనే మాట్లాడతారని, ప్రజల కోసం కాదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్ నినోపై ఇంజినీర్లతో సమావేశమై ప్రత్యామ్నాయంపై చర్చించాలని హితవు పలికారు.గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












