Terror Attack: జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి కలకలం రేపింది. ముష్కరుడు రెచ్చిపోయాడు. అత్యంత సమీపం నుంచి హెడ్ కానిస్టేబుల్ ను కాల్చి చంపాడు. వెనుక నుంచి వచ్చిన ముష్కరుడు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కానిస్టేబుల్ ను కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చనిపోయారు. మృతుడిని ఆషిక్ హుస్సేన్ గా గుర్తించారు. అమర్ నాథ్ యాత్ర డ్యూటీలో ఉన్నారు. సౌత్ కశ్మీర్ లోని అనంత్ నాగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అనంత్నాగ్-కోకెర్నాగ్ రోడ్డులోని లాల్ చౌక్ ప్రాంతం వద్ద మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. విధుల్లో ఉన్న ఇండియా రిజర్వ్ పోలీస్ (IRP) 3వ బెటాలియన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్, అతని సహచరుడిపై ఉగ్రవాదులు అస్సాల్ట్ రైఫిల్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో పలుమార్లు కాల్పులకు గురైన హుస్సేన్ మరణించారు. మరో పోలీసు సేఫ్ గా బయటపడ్డాడు.
రద్దీగా ఉండే మార్కెట్లోని ఒక దుకాణం ముందు పోలీస్ పై కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, ఈ కంటెంట్ను ఏ ప్లాట్ఫామ్లోనైనా షేర్ చేయడం, పబ్లిష్ చేయడం, ఫార్వార్డ్ చేయడం లేదా ప్రచారం చేయడం వంటివి చేయరాదని పోలీసులు హెచ్చరించారు. "ఇలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలగొచ్చు, ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లొచ్చు, చట్టపరమైన చర్యలకు దారితీయొచ్చు" అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. వందల మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కశ్మీర్లో ముఖ్యంగా అనంతనాగ్, షోపియాన్, కుల్గాం జిల్లాల్లో యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపారు. దాడి చేసిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అటు అమర్నాథ్ యాత్ర మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా యాత్ర ప్రస్తుతం నిలిపివేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో ఏటా జరిగే అమర్నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అయిప్పటికి ఈ దాడి జరగడం కలకలం రేపింది. కశ్మీర్లో చాలా కాలం తర్వాత అనంతనాగ్ లో ముష్కర దాడి జరిగింది.












