మెర్డెకా ప్యాలెస్లో ఘన స్వాగతం
రక్షణ, సముద్ర భద్రతే లక్ష్యంగా కీలక ఒప్పందాలు
డిజిటల్ కనెక్టివిటీ, ఖనిజ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం
ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధానికి గౌరవం
ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ భేటీ
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా చేరుకున్నారు. జాకార్తాలోని మెర్డెకా ప్యాలెస్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆయన ఈరోజు (మంగళవారం) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల అధినేతలు కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఇండోనేషియా ప్రభుత్వం ఘన సైనిక లాంఛనాలతో, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికింది.
ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సత్సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని విదేశీయుల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భాగంగా రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ కనెక్టివిటీ, కీలక ఖనిజాలు, వాణిజ్యం వంటి రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతలను పెంపొందించేందుకు 'మహాసాగర్' విజన్లో భాగంగా సముద్ర తీర రక్షణ బలోపేతంపై ఇరు నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల అనుసంధానం, మైనింగ్, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలలో భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకోవడానికి ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ చర్చల అనంతరం ప్రధాని మోడీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింతాంగ్ ఆదిపుర్ణ’ మెడల్ను అందించి గౌరవించింది. ఈ గౌరవాన్ని తాను కోట్లాది మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు మోడీ ప్రకటించారు.
ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోడీ జాకార్తాలో భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను విదేశాల్లో కాపాడుతూ, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు వారధిలా నిలుస్తున్న ప్రవాసుల పాత్రను ఆయన ఈ సందర్భంగా కొనియాడనున్నారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోడీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పర్యటించనున్నారు.












