ఏపీలో మరోదారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఓ యువతి ఏపీలో తాను చదువుకుంటున్న కాలేజ్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని కానూరులో చోటుచేసుకోగా.. స్థానికంగా సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన కంతేటి వైష్ణవి(19).. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కానూరులో గల శ్రీ భారతి ఇన్స్టిట్యూట్ లాంగ్టర్మ్ కోచింగ్ సెంటర్లో మూడు వారాల కిందట నీట్ శిక్షణ కోసం చేరింది.
వైష్ణవి ఫ్యామిలీ హైదరాబాద్లోని బేగంపేటలో నివాసం ఉంటున్నారు.ఏపీలో నీట్ శిక్షణ పొందుతున్న క్రమంలో వైష్ణవిని అనారోగ్య సమస్యలు వెంటాడినట్టు తెలుస్తోంది. ఇన్స్టిట్యూట్ హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటున్న ఆమె.. ఇటీవల ఇంటికి వెళ్లి రెండ్రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఇంత దూరంలో ఉంటూ చదవలేననీ తనను ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్టు తెలిసింది.
https://x.com/TeluguScribe/status/2085201943778197633?s=20
వారు ఆమెకు నచ్చజెప్పగా, ఈనెల 4న తనకు ఆరోగ్యం బాగోలేదని కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ రూంలో ఫ్యానుకు ఉరేసుకొని వైష్ణవి బలవన్మరణానికి పాల్పడింది. రాత్రి 9 గంటలకు యువతితో పాటు ఉండే ఇద్దరు విద్యార్థినులు తెలపడంతో కాలేజీ సిబ్బంది రూం తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే వైష్ణవి మృతి చెందింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












