Niharika Konidela: మెగా డాటర్ నిహారిక మంచి కథా బలమున్న చిత్రాలను అందిస్తోంది. ఇటీవల వచ్చిన రాకాసా మంచి కమర్షియల్ సక్సెస్ను అందుకుంది. ఈ సినిమాతో దర్శకురాలు మానస శర్మ కూడా బాగా పాపులరైంది. నిహారిక ఒకవైపు వెబ్ సిరీస్ చేస్తూనే మరో వైపు సినిమాలను నిర్మిస్తోంది. అలాగే, టీవీ షోస్ కూడా చేస్తోంది.
ఇంత బిజీగా ఉన్న నిహా..తన సోదరుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బరి అనే సినిమాను నిర్మిస్తోంది. విలేజ్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. విశేషం ఏమిటంటే నిహారిక నిర్మిస్తున్న ఈ మూవీలో మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్రలో కనిపించబోతుండటం. వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్రం ప్రీయమియర్స్ కి రెడీగా ఉంది. మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో, జూమ్ మీటింగ్లో పాల్గొన్నాడు వరుణ్ తేజ్. ఈ సందర్భంగా తన అభిమానులకి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. తన సోదరి నిహారిక నిర్మిస్తున్న బరి సినిమాలో నేను..నాన్న కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నామని..ఆ సీన్స్ అన్నీ మిమ్మలిని ఎంతగానో ఎగ్జైట్ చేస్తాయని రివీల్ చేశాడు. వాస్తవానికి, ఈ సినిమాను ఇంతకముందే ప్రకటించారు. కానీ, తాజాగా అప్డేట్ ఇచ్చాడు వరుణ్.
ఇక, ఈ సినిమాకి యదువంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకముందు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమాకి దర్శకుడీయన. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నిర్మాతగా నిహారికకి మంచి లాభాలు వచ్చాయి. మళ్ళీ, ఈ క్రేజీ కాంబినేషన్లో బరి సినిమా రూపొందబోతుండటంతో మంచి అంచనాలు మొదలయ్యాయి. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరికొన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.












