బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్లకు చండీగఢ్ జిల్లా కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 'బీయింగ్ హ్యూమన్' జ్యువెలరీ షోరూమ్ వివాదానికి సంబంధించిన ఒక మోసం కేసులో న్యాయస్థానం వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేస్తూ, వచ్చే అక్టోబర్ 5వ తేదీన కోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ వివాదం వివరాల్లోకి వెళితే.. చండీగఢ్లోని మణిమజ్రా ప్రాంతంలో ‘బీయింగ్ హ్యూమన్’ నగల షోరూమ్ ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రతినిధులు తనతో ఒప్పందం చేసుకున్నారని స్థానిక వ్యాపారవేత్త అరుణ్ గుప్తా కోర్టును ఆశ్రయించారు. వారి ఇచ్చిన హామీలను నమ్మి షోరూమ్ అభివృద్ధి, నిర్వహణ కోసం తాను సుమారు రూ.3కోట్ల వరకు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు ఆయన తన ఫిర్యాదులో వెల్లడించారు.
ఒప్పంద ప్రకారం తాను అన్ని షరతులనూ నెరవేర్చినప్పటికీ, షోరూమ్ ప్రారంభమయ్యాక కంపెనీ నుంచి ఎలాంటి వ్యాపార సహకారం లభించలేదని అరుణ్ గుప్తా ఆరోపించారు. ముఖ్యంగా ఫిబ్రవరి 2020 నుంచి నగలు, స్టాక్ సరఫరాను పూర్తిగా నిలిపివేయడంతో తీవ్ర నష్టాలొచ్చి షోరూమ్ను మూసివేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమికంగా కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి తనను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీశారని ఆయన కోర్టుకు వివరించారు.
అయితే, అరుణ్ గుప్తాతో జరిగిన వ్యాపార ఒప్పందంలో సల్మాన్ ఖాన్కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదా ప్రమేయం లేదని సదరు కంపెనీ ప్రతినిధులు గతంలోనే వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, బాధితుడి ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం.. సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరాతో పాటు ‘స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ డైరెక్టర్లకు కూడా సమన్లు పంపింది. ఈ కేసు తదుపరి కీలక విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది.












