NTRIVIKRAM: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న భారీ సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్ "గాడ్ ఆఫ్ వార్" అనౌన్స్మెంట్ తోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్కు తగ్గట్టుగా, సరికొత్త మైథలాజికల్ టచ్తో త్రివిక్రమ్ ఈ కథను సిద్ధం చేశారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కనీసం సెట్స్ పైకి కూడా వెళ్లకుండానే కోలీవుడ్లో సరికొత్త రాజకీయ వివాదానికి తెరలేపింది.
ఈ సినిమా కథాంశం తమిళులు ఎంతగానో ఆరాధించే మురుగన్ (కుమారస్వామి) చుట్టూ తిరుగుతుందని, ఆయన జన్మస్థలం ఉత్తర భారతదేశం అనే కోణంలో సినిమా సాగుతుందనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది. ఇదే ఇప్పుడు వివాదానికి మూలమైంది. మురుగన్ మా దైవమని, ఆయనకు ఉత్తరాదితో ముడిపెట్టడం ఏంటంటూ తమిళ నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు.
చిత్ర యూనిట్కు అసలైన షాక్ ఇస్తూ ఈ వివాదంలోకి తమిళనాట ప్రముఖ రాజకీయ పార్టీ నామ్ తమీజర్ కట్చి (NTK) అధినేత సీమన్ ఎంట్రీ ఇచ్చారు. తమిళుల సెంటిమెంట్తో ఆడుకుంటే ఊరుకునేది లేదని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మురుగన్ చరిత్రను తప్పుగా చూపిస్తే చిత్ర బృందం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు సినిమా ఇండస్ట్రీలో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అయితే పురాణాలు, ఇతిహాసాలపై దర్శకుడు త్రివిక్రమ్కు ఉన్న పట్టు, రీసెర్చ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ సబ్జెక్ట్ను ఎంచుకునే అవకాశం లేదు. అయినప్పటికీ, షూటింగ్ ప్రారంభానికి ముందే ఇలాంటి పొలిటికల్ ప్రెజర్ ఎదురవ్వడం సినిమా యూనిట్ను డైలమాలో పడేసింది. మరి ఈ వివాదంపై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో, ఎలాంటి క్లారిటీ ఇచ్చి ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడతారో చూడాలి.












