పరీక్షా విధానంలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం
నందన్ నీలేకని ఆధ్వర్యంలో హైపవర్డ్ టాస్క్ఫోర్స్
ఎన్టీఏ ను పునర్ వ్యవస్థీకరించనున్న నీలేకని
ఎవరీ నందన్ నీలేకని..?
నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలు.. ఆ తర్వాత తలెత్తిన ఉద్యమాలు కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామా దాకా దారి తీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పరీక్షా విధానంలో సమూల మార్పులకు సిద్ధమైంది. ఈ మేరకు నందన్ నీలేకని ఆధ్వర్యంలో హైపవర్డ్ టాస్క్ఫోర్స్ను నియమించింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ వీడియో సందేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ క్రమంలో నందన్ నీలేకని ఎవరని చాలా మంది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు.
టాలెంటెడ్ టెక్నోక్రాట్.. నందన్ నీలేకని
ఆధునిక భారత దేశంలో అద్భుతమైన సాంకేతిక సంస్కరణలకు మూల స్తంభంగా నిలిచిన వ్యక్తి నందన్ నీలేకని. ఆధార్, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ ఇండియా గురించి మాట్లాడితే.. తప్పకుండా ఈయన గురించి కూడా మాట్లాడాల్సిందే. ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కెరీర్ ప్రారంభించి, ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ ప్రాజెక్ట్కు నాయకత్వం వహించిన వ్యక్తి నందన్ నీలేకని. ఇప్పుడు మనందరి చేతుల్లో ఉన్న ఆధార్ కార్డులకు ఈయనే ఆధారం.
1955 జూన్ 2న బెంగళూరులో జన్మించిన నందన్ నీలేకని, ముంబై ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1981లో నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించిన ఏడుగురు సహ వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. ఇన్ఫోసిస్ను ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీగా తీర్చిదిద్దడంలో నీలేకని కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు సంస్థ సీఈఓగా పనిచేసి కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.
2009లో కేంద్ర ప్రభుత్వం నిలేకనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తొలి చైర్మన్గా నియమించింది. ఆయన నాయకత్వంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్ రూపుదిద్దుకుంది.
డిజిటల్ విప్లవానికి కారకుడు
నేడు 140 కోట్లకు పైగా భారతీయులకు ఆధార్ గుర్తింపు వ్యవస్థ అందుబాటులో ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి బ్యాంకింగ్, మొబైల్ కనెక్షన్లు, డిజిటల్ సేవల వరకు ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఓ రకంగా ఆధార్ మన డిజిటల్ రూపం. దీనిని రూపొందించిందే నీలేకని. అంతేకాదు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో కూడా నందన్ నీలేకని ఆలోచనలు ఎంతో ప్రభావం చూపాయి. యూపీఐ, డిజిలాకర్, అకౌంట్ అగ్రిగేటర్ వంటి వ్యవస్థల అభివృద్ధికి ఆయన నిరంతరం మద్దతు ఇస్తూ వస్తున్నారు.
రాజకీయాల్లోనూ ప్రయోగం
టెక్నాలజీ ప్రపంచంలో ఎప్పుడూ బిజీగా ఉంటారు నందన్ నీలేకని. ఆయన మనసెప్పుడూ టెక్నాలజీ చుట్టే తిరుగుతుంటుంది. డిజిటల్ ప్రపంచమే ఆయన ప్రపంచం. అంతటి బిజీ లైఫ్లోనూ రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చారు. 2014లో బెంగళూరు సౌత్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. కానీ విజయం సాధించలేదు. ఆ తర్వాత తిరిగి ఇన్ఫోసిస్లో చేరి ప్రస్తుతం సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు.
ముందు నుంచీ కాంగ్రెస్తో అనుబంధం ఉంది నీలేకనికి. ప్రస్తుతం అనూహ్యంగా ఎన్డీయే సర్కారులో ఓ కీలక పాత్ర పోషించాలని పిలుపొచ్చింది. దేశంలోని పరీక్షా విధానంలో సంస్కరణలపై సిఫార్సులకు నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. పలువురు మేధావులతో కలిసి నీలేకని ఈ పనిని పూర్తి చేయనున్నారు.












