VC Sajjanar: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అడ్డంగా దోచేస్తున్నారు. ఫేక్ మేసేజ్ లు, లింకులతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసాలక తెరలేపారు సైబర్ నేరగాళ్లు. దీనిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను అలర్ట్ చేశారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ క్రిమినల్స్ ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నది ఆయన వివరించారు.
ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..
ముందస్తుగా 10వేల రూపాయలు చెల్లించాలని, ఇదే చివరి రోజు అంటూ మాటలు చెబుతారు. అలాంటి మాటలు నమ్మొద్దని సీపీ హెచ్చరించారు. ఇక వాట్సాప్, ఎస్ఎంఎస్ ల ద్వారా లింకులు, ఏపీకే ఫైళ్లు పంపుతారని చెప్పారు. వాటిని పొరపాటున కూడా క్లిక్ చేయొద్దన్నారు. ఇక AnyDesk, TeamViewer వంటి యాప్స్ ను ఎట్టి పరిస్థితుల్లో ఇన్ స్టాల్ చేయొద్దన్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే బాధితులు వెంటనే ఏం చేయాలో కూడా ఆయన చెప్పారు. బాధితులు తక్షణమే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అలా చేయడం వల్ల బాధితుల డబ్బును తిరిగి పొందేందుకు చాలావరకు అవకాశం ఉంటుందన్నారు.
ఏపీకే ఫైల్స్, నకిలీ లింకుల ద్వారా ట్రాప్..
''సైబర్ నేరగాళ్లు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. హానికరమైన APK ఫైళ్లు, నకిలీ వాట్సాప్ లింకులు, మోసపూరిత వెబ్సైట్ల ద్వారా ట్రాప్ చేస్తారు. దరఖాస్తుదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలిస్తారు. ముందస్తుగా రూ.10 వేలు చెల్లింపు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే అదనుగా సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ అధికారులు లేదా మధ్యవర్తులుగా నటిస్తూ నకిలీ కాల్స్, ఎస్ఎంఎస్ లు, ఫిషింగ్ లింకుల ద్వారా లబ్ధిదారులను మోసం చేయడానికి ప్రయత్నించొచ్చు. వాస్తవానికి పూర్తి పారదర్శకంగా జరిగే ఈ కేటాయింపు ప్రక్రియలో బ్రోకర్లకు లేదా మధ్యవర్తులకు ఎటువంటి పాత్ర లేదని గుర్తించాలి'' అని మోసాలు జరిగే తీరు గురించి సీపీ వివరించారు.
థర్డ్ పార్టీకి చెల్లింపు చేస్తే ఇంటి ఇళ్ల కేటాయింపు ఖాయమవుతుందని చెప్పే వాదనలను, లేదా చివరి గడువు ముగిసిపోయిందని, రద్దును నివారించడానికి తక్షణమే చెల్లింపు చేయాలని భయాందోళనలు సృష్టించే సందేశాలను నమ్మవద్దని ఆయన ప్రజలను హెచ్చరించారు.
AnyDesk లేదా TeamViewer ఇన్స్టాల్ చేయొద్దు..
అపరిచితుల ప్రోత్సాహంతో APK ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవడం లేదా AnyDesk లేదా TeamViewer వంటి స్క్రీన్-షేరింగ్ అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోవడం వంటివి చేయవద్దని కమిషనర్ హెచ్చరించారు. వీటి వల్ల సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలకు యాక్సెస్ పొందే అవకాశం ఉందన్నారు. దరఖాస్తుదారులు అపరిచిత వాట్సాప్ లేదా SMS లింక్లపై క్లిక్ చేయడం మానుకోవాలన్నారు. అలాగే ఆధార్ వివరాలు, బ్యాంకు సమాచారం లేదా వన్-టైమ్ పాస్వర్డ్లను (OTPలు) ఎప్పుడూ పంచుకోకూడదని జాగ్రత్తలు చెప్పారు.
బాధితులు వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయాలి..
చెల్లింపులు చేయడానికి మాత్రమే UPI PIN అవసరమని, రీఫండ్ (డబ్బు వాపసు) పొందడానికి అది ఎప్పుడూ అవసరం ఉండదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ప్రభుత్వం 040-24603572 నెంబర్తో ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. సైబర్ మోసానికి గురైన బాధితులు, తమ డబ్బును నిలిపివేయడంలో (freeze) సహాయపడేందుకు, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930ను సంప్రదించాలన్నారు. లేదా 'నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్' ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.












