ఏపీలో బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఇంకా కనిపెట్టకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. మూడు నెలలు అయినా బాలిక ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోయారని..అసలు ఏం చేస్తున్నారని గుంటూరు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం.. "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు తెలిసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్కు వెళ్లి కనిపించకుండా పోయింది. బాధితురాలి తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
బుధవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని మండిపడింది. గతంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ను పోలీస్ స్టేషన్కు రాకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తూ ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. మూడు నెలలు ఓ బాలికను కనిపెట్టడానికి సరిపోదా? అంటూ ప్రశ్నించినట్టు సమాచారం.
https://x.com/pulsenewsbreak/status/2095348557058539821?s=20
కాగా, ఈ కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పనిచేయడం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం.. గురువారం నాటికల్లా బాలికను తమ ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నేడు బాలికను కోర్టు ఎదుట హాజరు పరుస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.












