సులువుగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన అధికారుల అత్యాశ వల్ల కష్టపడి సంపాదించిన ఆస్తి పరాయి పాలావుతుంది.. నకిలీ పత్రాలు, మాల్వేర్ మోసాలు, అధికారుల నిర్లక్ష్యంతో ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్లు శరవేగంగా పెరిగిపోతున్నాయి! అమాయక ప్రజలు అన్యాయం అవుతున్నా చట్టంలో మార్పులు రావడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి..
మరో అడుగు ముందుకేసిన అవినీతి అధికారులు.. మోసాగాళ్లతో చేతులు కలిపి బ్యాంకులను దగా చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి రావడం తెలిసిందే.. తాజాగా లేని ఆస్తులను కాగితాలపై సృష్టించి.. కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ముంచేసిన ఘరానా మోసం నగరంలో వెలుగులోకి వచ్చింది!..
ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన చంపాపేట సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసుఫ్ ఉర్ రెహ్మాన్ను కీసర పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. కీసర ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, జవహర్నగర్ ఏసీపీ చక్రపాణిలతో కలిసి మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ బుధవారం సికింద్రాబాద్లోని కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు.

పోలీసు వివరాల ప్రకారం... కొందరు రియల్టర్లు, మధ్యవర్తులు సులభంగా డబ్బు సంపాదించేందుకు ఒక ముఠాగా ఏర్పడ్డారు. లేని ఆస్తులకు నకిలీ పత్రాలు తయారు చేసి, అప్పటి కీసర సబ్ రిజిస్ట్రార్గా ఉన్న యూసుఫ్ సాయంతో రిజిస్ట్రేషన్లు చేయించారు. ఉనికిలో లేని దాదాపు 11 ఆస్తులను చూపి వివిధ బ్యాంకుల నుంచి రూ.4.11 కోట్ల రుణాలు పొంది, ఆపై చేతులెత్తేశారు.
ఈ మోసంపై బ్యాంకర్ల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కేసులో బ్యాంకు సిబ్బంది, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో కలిపి మొత్తం 29 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. గతంలోనే ఎనిమిది మందిని అరెస్ట్ చేసి అక్రమాలపై ఆరా తీయగా సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్ అక్రమాలు బయటపడ్డాయి. 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఆయన వందల సంఖ్యలో ఇలాంటి నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఆయనపై ఇప్పటికే ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని రిమాండ్కు తరలించారు..












