పాకిస్తాన్లో దారుణం
శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఆలయం కూల్చివేత
తీవ్రంగా స్పందించిన భారత్
ఆలయం గతమెంతో ఘనం..!
పాకిస్థాన్లో ఓ పురాతన హిందూ ఆలయం కూలిపోయింది. ఇప్పుడు ఆ ఆలయం చుట్టూనే వివాదం మొదలైంది. ఇది వర్షాల కారణంగా కూలిపోయిందా? లేక కావాలనే ధ్వంసం చేశారా? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. కానీ ఈ వివాదం మధ్యలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మాత్రం ముందుకొస్తోంది. 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయం వెనుక ఉన్న కథేంటి?
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గుడి..
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్.. నరోవాల్ జిల్లా.. సిరాజ్ గ్రామం. ఇదే ఈ పురాతన ఆలయం ఉన్న ప్రాంతం. లాహోర్కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది.
ఇక్కడ ఉన్న హిందూ ఆలయం వందేళ్లకు పైగా పురాతనమైనదని పాకిస్థాన్లోని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ETPB) కూడా అంగీకరించింది. ఆ సంస్థ ప్రకారం.. ఈ ఆలయం నిర్మించి సుమారు 100 నుంచి 125 ఏళ్లకు పైగానే అయి ఉంటుంది. అంటే ఈ ఆలయ నిర్మాణం 20వ శతాబ్దం ప్రారంభ దశల నాటిదై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు..
అయితే ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి చారిత్రక రికార్డులు ఇప్పుడు అందుబాటులో లేవు. ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఏ దేవతను ప్రధానంగా ఆరాధించేవారు? అసలు ఆలయానికి అప్పట్లో ఏ పేరు ఉండేది? వంటి వివరాలు అధికారిక రికార్డుల్లో స్పష్టంగా కనిపించడం లేదు.
విభజనకు ముందు హిందూ సమాజానికి గుర్తుగా..
ఈ ఆలయాన్ని అర్థం చేసుకోవాలంటే 1947కు ముందు పంజాబ్ చరిత్రను గుర్తు చేసుకోవాలి. భారత్-పాకిస్థాన్ విభజనకు ముందు పంజాబ్లో హిందువులు, సిక్కులు, ముస్లింలు కలిసి జీవించిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లో వారి ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రార్థనా స్థలాలు, ధార్మిక నిర్మాణాలు ఉండేవి. అలాంటి పాత సామాజిక, మతపరమైన భౌగోళిక వ్యవస్థకు మిగిలిన భౌతిక ఆనవాళ్లలో ఇలాంటి పాత ఆలయాలు కూడా ఒక భాగం.
సిరాజ్ గ్రామంలోని ఈ ఆలయం కూడా ఆ కాలం నాటి హిందూ సమాజ ఉనికికి ఒక గుర్తుగా భావించవచ్చు. ముఖ్యంగా.. నరోవాల్ జిల్లాలో హిందూ జనాభా చాలా చిన్నదిగా మారిపోయిన పరిస్థితుల్లో, ఇలాంటి పాత ఆలయం కేవలం ఓ భవనం కాదు. అది ఒకప్పుడు అక్కడ నివసించిన సమాజం, వారి ఆచారాలు, వారి జీవన విధానానికి మిగిలిన ఆనవాళ్లలో ఒకటి.
ఆలయం ఉన్న ప్రాంతం ఎందుకు కీలకం?
నరోవాల్ ప్రాంతానికి చారిత్రకంగా ప్రత్యేక స్థానం ఉంది. పంజాబ్ ప్రాంతంలోని ఈ భూభాగం విభజనకు ముందు వివిధ మతాల ప్రజల సహజీవనాన్ని చూసింది. కానీ విభజన తర్వాత మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక హిందూ కుటుంబాలు భారతదేశానికి వలస వచ్చాయి. ఫలితంగా పాకిస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో హిందూ ప్రార్థనా స్థలాలు క్రమంగా నిర్జనంగా మారాయి.
నరోవాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించిందని చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడి హిందూ సమాజం పరిమిత సంఖ్యలో ఉండటంతో పాత ఆలయాలు నిరంతర పూజలకు అందుబాటులో లేకపోవడం, ఇతర అవసరాలకు ఉపయోగిస్తుండడం అక్కడ సాధారణంగా మారిపోయింది.
అందుకే సిరాజ్లోని ఈ ఆలయం కూలిపోవడం కేవలం ఒక పాత భవనం ధ్వంసం కావడమే కాకుండా.. ఒక ప్రాంతం గత చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయన్న ఆందోళనను కూడా తెరపైకి తెచ్చింది.
అసలు ఆలయం ఎలా కూలింది?
ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఆగస్టు 21న ఆలయం ధ్వంసమైనట్లు సమాచారం. మైనారిటీ హక్కుల సంస్థ Pakistan Masiha Millat Party మాత్రం ఇది సహజంగా కూలిపోలేదని ఆరోపిస్తోంది. పక్కనే ఉన్న సెమినరీ విస్తరణ కోసం కొందరు ఆలయాన్ని కూల్చివేసి, అక్కడి ఇటుకలు, గోపురానికి సంబంధించిన లోహ సామగ్రి తదితరాలను తొలగించారని ఆరోపించింది.
అయితే పాకిస్థాన్లోని ETPB మాత్రం ఈ ఆరోపణను ఖండించింది. భారీ వర్షాల కారణంగానే ఆలయ నిర్మాణం కూలిపోయిందని చెబుతోంది. పంజాబ్ ప్రభుత్వం కూడా ఆలయంలోని కొంత భాగం భారీ వర్షాలకు కూలిపోయిందని పేర్కొంటూ, దానిని పునరుద్ధరిస్తామని తెలిపింది. అంటే.. ఆలయం కూలింది అన్న విషయంలో పెద్దగా వివాదం లేదు. కానీ ఎందుకు కూలింది అన్నదే అసలు ప్రశ్న.
ఆలయ భూమిపై వివాదం..
ఈ వివాదంలో మరో కీలక అంశం ఆలయం పక్కనున్న భూమి. ETPB ప్రకారం.. ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని ఒక సెమినరీకి లీజుకు ఇచ్చారు. అయితే ఆలయం ఉన్న భూమిని మాత్రం లీజుకు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మైనారిటీ హక్కుల సంస్థ మాత్రం గతంలో సెమినరీకి ఇచ్చిన లీజు రద్దయినా, ఆ ప్రాంతంలో ఆక్రమణలు కొనసాగాయని ఆరోపిస్తోంది. అందుకే ఇప్పుడు భారత్ కూడా పాకిస్థాన్ను ప్రశ్నిస్తోంది.
భారత్ ఎందుకు సీరియస్గా స్పందించింది?
సిరాజ్ గ్రామంలోని చారిత్రక ఆలయం ధ్వంసంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీ ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేయడం ఖండించాల్సిన చర్య అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని పాకిస్థాన్ను కోరింది. అంతేకాదు.. ధ్వంసమైన ఆలయాన్ని పునరుద్ధరించాలని, మైనారిటీ ప్రజల ప్రార్థనా స్థలాలు, వారి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం పాకిస్థాన్ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది.
ఇక్కడ అసలు అంశం ఒక్క ఆలయం కాదు. ఒకప్పుడు ఒక ప్రాంతంలో జీవించిన సమాజం చరిత్రకు మిగిలిన ఆనవాళ్లను ఎలా కాపాడాలి? అన్నదే పెద్ద ప్రశ్న. 125 ఏళ్ల క్రితం నిర్మించిందిగా భావిస్తున్న ఈ ఆలయానికి పూర్తి చరిత్ర ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు. దానిని నిర్మించింది ఎవరో తెలియకపోవచ్చు. దాని అసలు పేరు కూడా తెలియకపోవచ్చు. కానీ ఆ ఆలయం ఒక విషయం మాత్రం చెబుతోంది.
ఈ నేలపై ఒకప్పుడు హిందూ సమాజం కూడా జీవించింది. వారి ప్రార్థనా స్థలాలు కూడా ఉండేవి. వారి సంస్కృతి కూడా ఈ నేలలో భాగమే. అందుకే సిరాజ్ ఆలయాన్ని తిరిగి నిర్మిస్తారా? దాని చరిత్రను కాపాడుతారా? లేక మరో చారిత్రక ఆనవాలు కాలగర్భంలో కలిసిపోతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







