Cm Revanth: రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సీఎం రేవంత్ ప్రశంసించారు. ఆనాడు 1300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి, రైతులపై కేసులు ఎత్తివేసి అన్నదాతల గుండెల్లో వైఎస్ రారాజుగా నిలిచారని చెప్పారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్ దే అన్నారు రేవంత్.
నాడు వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్ బీసీ ఇప్పుడు ఆగిపోయాయన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామన్న రేవంత్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
''ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్ బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితమిస్తాం. వైఎస్ అభిమానులకు ఒక మాట గుర్తు చేస్తున్నా.
వైఎస్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు.
దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు అండగా నిలబడాలి. అండగా నిలబడాల్సిన చారిత్రక సందర్భం ఈరోజు ఈ దేశానికి అవసరం. దేశానికి బలమైన నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్ కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి. ఇందుకు మీ అందరి మద్దతు అవసరం. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మనమంతా కలిసి కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం'' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని.. నెహ్రూ ముందు చూపుతో దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతుల వరకు చేరుకుందని రేవంత్ తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా రైతు పండించే పంటకు మద్దతు ధరను అందించే చర్యలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీది అని చెప్పారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ ఆహార భద్రత కల్పించాలని సోనియా గాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. అగ్రికల్చర్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచిన చరిత్ర ఇందిరా గాంధీది అని రేవంత్ పేర్కొన్నారు. పీడీఎస్ విధానం తీసుకొచ్చి రేషన్ షాప్ ద్వారా నిత్యవసర సరుకులు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ సొంతం అన్నారు. తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి బియ్యం అందిస్తున్నామంటే అనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి కారణం అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.







