Godavari Water: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల అయ్యాయి. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లను విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకం ఆవిష్కరించారు చంద్రబాబు. ఆ తర్వాత రెగ్యులేటర్ ఆన్ చేసి నీటిని రిలీజ్ చేశారు. గోదావరికి అఖండ హారతి ఇచ్చారు. ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది.
పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గోదారమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదారమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాల విడుదలను పురస్కరించుకుని పాయకరావుపేట సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈరోజు ఎంతో శుభ దినం అన్నారు. అనకాపల్లి బెల్లం అంత తియ్యగా ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర అవుతుంది.. ఉత్తమ ఆంధ్ర ఉన్నతాంధ్రగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ఖాయమని, రాసి పెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇక్కడి నుంచి వలసలు ఆగిపోయి.. ఇక్కడికే జనం వలస వస్తారని చెప్పారు.
రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జల హారతి ఇస్తామన్నారు. వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న వద్దకు గోదావరి జలాలను తీసుకెళ్తామన్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని గత ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చామని, మీరు నిండు మనసుతో ఆశీర్వదించారని, ఆ దీవెనల ఫలితమే నేడు అనకాపల్లికి గోదావరమ్మ వచ్చింది, తెచ్చాము అని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.











