Konda Surekha: తన కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదంలో మంత్రి కొండా సురేఖ తగ్గేదేలే అన్నట్లుగా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ.. ముఖ్యమంత్రి రేవంత్ తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడారు. తనపై చర్యలు తీసుకునేముందు సీఎం రేవంత్ పై యాక్షన్ తీసుకోవాలని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ పెద్దలను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదంలో తన తప్పు లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చెప్పినట్లు తెలిపారు. ''నేను చెప్పాల్సింది ఆయనకు చెప్పాను. నా కూతురు ఇండిపెండెంట్. ఆమెకి ఏదైనా మాట్లాడే హక్కు ఉంది. నేను వద్దని చెప్పలేను'' అని ఖర్గేతో చెప్పినట్లు కొండా సురేఖ వెల్లడించారు.
బీసీ మహిళను అయిన తనపై చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని కూడా ఖర్గేతో చెప్పానన్నారు. నేను పద్మశాలి, నా భర్త మున్నూరు కాపు. మా సామాజిక వర్గాల ఓట్లు 16శాతం ఉన్నాయి. నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. మంత్రిగా నేను బాగానే పని చేస్తున్నా. మంత్రి పదవిలో నన్ను కొనసాగించాలని ఖర్గేను కోరా'' అని కొండా సురేఖ తెలిపారు.
''మహిళలు స్వతంత్రంగా మాట్లాడాలని రాహుల్ గాంధీ చెబుతున్నారు. నా బిడ్డకు పెళ్లైంది. ఆమె ఒక ఇండిపెండెంట్. ఒక ఇంటి కోడలిగా తను మాట్లాడిందని నేను అనుకుంటున్నాను. అలా మాట్లాడొద్దు అని నేను చెప్పడానికి లేదు. తన పొలిటికల్ లైఫ్ తన ఇష్టం. మంత్రిగా బాగా పని చేస్తున్నా. నా మీద ఎక్కడా ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నాకు ఇచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నా'' అని కొండా సురేఖ అన్నారు.
అంతేకాదు తనపై చర్యలు తీసుకుంటే బీసీలంతా ఏకం అవుతారని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. తన కూతురిని రెచ్చగొట్టేలా సీఎం రేవంత్ మాట్లాడారని సురేఖ అన్నారు. తన కూతురు ఏం సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చిందో ఖర్గేకు వివరించానన్నారు. ''మా కంటే ముందు మాట్లాడిన రెడ్డి నేతలపై చర్యలు ఎందుకు లేవు? కొందరు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్క భార్యల కమీషన్లపైనా ఫిర్యాదులు ఉన్నాయి. వాటికి ఏం సమాధానం చెబుతారు?'' అని కొండా సురేఖ ప్రశ్నల వర్షం కురిపించారు.










