Gajwel Land Scam: గజ్వేల్ నియోజకవర్గంలో భూదందా వెలుగు చూసింది. కాంగ్రెస్ నాయకులు బరి తెగించారు. రాత్రికి రాత్రే 50 ఎకరాల భూమిని కొట్టేశారు. గజ్వేల్ మండలం హవాడిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 49లోని 50 ఎకరాల అసైన్డ్ ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా రాత్రికి రాత్రి సిద్ధిపేట కలెక్టర్, రెవెన్యూ అధికారులు మార్చేశారు.
20ఏళ్లుగా ఆ వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్న దళిత, గిరిజనులను కాదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ప్రజా సంబంధాల అధికారి (PRO) తల్లి పేరు మీద 25 ఎకరాలు, మరికొందరి పేరు మీద 25 ఎకరాలు రాయించేసుకున్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడు ఈ 50 ఎకరాలు కొని రికార్డులు తారుమారు చేసేశాడు. అసైన్డ్ భూమిని రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకుడి పేరు మీదకి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది మార్చేశారు.
ఆ భూముల్లో 20ఏళ్లుగా సాగు చేస్తున్న దళిత, గిరిజనులకు ఎకరానికి రూ.20 వేలు ఇచ్చి వారితో బలవంతంగా లెటర్ మీద సంతకాలు చేయించుకున్నాడు కాంగ్రెస్ నాయకుడు. సమాచార చట్టం కింద 49 సర్వే నెంబర్కు సంబంధించిన సమాచారం అడిగినా రెవెన్యూ అధికారులు ఇవ్వడం లేదు. వెంటనే 49 సర్వే నెంబర్ భూముల మీద విచారణ జరపాలని ఎస్సీ, ఎస్టీ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.









