Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీలో హాట్ కామెంట్స్ కు కేరాఫ్ గా మారిన నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తనదైన శైలి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాను ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీని ఎవరూ కబ్జా చేయలేరని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం మంచిదే.. కానీ, వారు తమ ఇంట్లోకి వచ్చి తమనే వెళ్లగొడతామంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్ఆర్ అభిమానులం, శిష్యులం
తెలంగాణలో రాబోయేది వైఎస్ యుగమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. మేము వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులం, ఆయన శిష్యులం అని గర్వంగా చెప్పుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. తెలంగాణలో ఎప్పటికీ వైఎస్ఆర్ పేరు ఉంటుందన్నారు. మా అందరినీ తయారు చేసింది ఆయనే అని తెలిపారు. వైఎస్ఆర్ నాయకత్వంలోనే నేను ఎంపీగా గెలిచాను అని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ఆర్ మాదిరే.. మేము కూడా మాట ఇస్తే.. మాట తప్పం, మడమ తిప్పం అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు సీఎం, సీఎం అని నినాదాలు చేయగా.. ఆ పదవి వచ్చే టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అని రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పదవుల కోసం కొట్లాడం, డబ్బులు ఆశించం
''రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగమే. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగితే వారి తరపున నేను పోరాడతా. రాజశేఖర్ రెడ్డి అభిమానిగా చెబుతున్నా. ఎవరెన్ని బెదిరింపులు చేసినా, ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా రక్తం కాంగ్రెస్ పార్టీ రక్తం. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తాం.
ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం. మేము ప్రజల కోసం, ఇచ్చిన హామీల కోసం, అవినీతి మీద కొట్లాడతాం. పేదలకు అండగా ఉంటాం. విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందాలి. పేదలకు అన్యాయం జరగొద్దనే ఆలోచనతో ముందుకుపోతాం తప్పితే పదవుల కోసం కొట్లాడం. డబ్బులు ఆశించం. రాజశేఖర్ రెడ్డి యుగం మళ్లీ వస్తుంది'' అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.







