National

India: రాజకీయ పార్టీలకు పరీక్షగా మారిన హామీలు.. దేశంలో ఉచిత విద్య-వైద్యం సాధ్యమేనా?

రచన: Venu11 నిమిషాల పఠనం

మాటలతో కోటలు కడుతూ.. ఆ కోటలకు ప్రజలే రాజులని మభ్యపెడుతున్న రాజకీయ నాయకులకు ఇదంతా తెలియదా అంటే.. తెలుసు కానీ వారికి పదవులు, డబ్బు, పలుకుబడి కావాలి.. నిజమైన ప్రజా సేవ చేస్తే ఏం మిగులుతుంది. అందుకే వారి పెట్టుబడి మాటలు..

ఎన్నికలు వస్తే చాలు.. రాజకీయ పార్టీల హామీల జాబితాలో విద్య, వైద్యం తప్పనిసరిగా ఉంటాయి. అందరికీ ఉచిత విద్య.. ఉచిత వైద్యం అంటూ నాయకులు హామీలు ఇస్తారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ రెండు అంశాలు నేరుగా జీవితంతో ముడిపడి ఉండటంతో.. ఇలాంటి హామీలు ఓటర్లను బలంగా ఆకర్షిస్తాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత వీటి ఊసే ఉండదు.. ఇక సందు దొరికితే చాలు ఉచితం కోసం మాట్లాడే నాయకుల్లో ఈ హామీ పట్ల చిత్తశుద్ధి ఉండటం లేదనే ఆరోపణలున్నాయి..

ఈ క్రమంలో ప్రతి సామాన్యుడి అంతరంగంలో నాయకులు ఎన్నికల ముందు ఉచిత విద్య, ఉచిత వైద్యం అని హామీలు ఇస్తారు.. కానీ గెలిచాక ఎందుకు నిలబెట్టుకోరు? అసలు ఇవి అందరికీ ఉచితంగా ఇవ్వడం నిజంగా సాధ్యమేనా? అనే సందేహాలు పుడుతాయి.. అయితే దీనికి సమాధానం సాధ్యమే అని విశ్లేషకులు చెబుతున్నారు.. ఇందుకు ఉదాహరణగా స్కాండినేవియన్ దేశాలైన ఫిన్లాండ్, నార్వే, స్వీడన్లతో పాటు క్యూబా వంటి దేశాలు నాణ్యమైన విద్యను, వైద్యాన్ని ప్రజలందరికీ ఉచితంగా అందిస్తూ విజయవంతంగా నడుస్తున్నాయని పేర్కొంటున్నారు.. అలాగే మరిన్ని దేశాలు నామమాత్రపు ఫీజుతో పేదలపై భారం పడకుండా ఈ సేవలు అందిస్తున్నట్టు చెబుతున్నారు..

మొత్తానికి ప్రజలకు అందించే సేవలలో మన దేశం కంటే మెరుగ్గా కొన్ని దేశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి మంచి పని ప్రపంచంలో కొన్ని దేశాలు చేయగలిగితే.. భారత్‌లో ఎందుకు సాధ్యం కాదు? అనే ప్రశ్న పుడుతుంది.. అయితే స్కాండినేవియన్ దేశాల మాదిరి వ్యవస్థను తీసుకురావాలంటే ముందుగా దానికి కావాల్సిన పన్నుల ఆదాయం, ప్రభుత్వ మౌలిక వసతులు, సిబ్బంది, బడ్జెట్ కేటాయింపులు పెంచాలని విశ్లేషకులు అంటున్నారు..

ఇదే సమయంలో మన రాజకీయ నాయకులు దీనిని సాధ్యం చేయకపోవడానికి ప్రధాన కారణం వివరిస్తూ.. ఈ రెండు రంగాలను వారు దేశ భవిష్యత్తు కోసం చేసే దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడకపోవడమే గాక.. నాయకుల దృష్టిలో ఇవి కేవలం ఓట్లు తెచ్చిపెట్టే ఉచిత హామీలుగా మాత్రమే కనిపిస్తుందని వివరిస్తున్నారు.. అయితే ఇది సాధ్యం కావాలంటే పన్నుల విధానంలో మార్పు రావాలి. అత్యధిక సంపద ఉన్నవారిపై తగినంత పన్ను విధించి, ఆ ఆదాయాన్ని నేరుగా విద్య, వైద్య రంగాలకు మళ్లించాలని సూచిస్తున్నారు.

మరోవైపు బడ్జెట్ కేటాయింపులు పారదర్శకంగా పెరగాలి. కానీ మన దేశంలో ఎకనామిక్ సర్వే 2025-26 నివేదిక ప్రకారం, జీడీపీలో విద్యా రంగానికి కేటాయింపులు 2.7% గా ఉన్నాయి. జాతీయ విద్యా విధానం 2020 (NEP) ప్రకారం జీడీపీలో కనీసం 6% విద్యకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రస్తుత వ్యయం దానికి చాలా దూరంలోనే ఉంది. మరోవైపు అధికారిక గణాంకాల ప్రకారం, ప్రస్తుతం భారతదేశం జీడీపీలో ఆరోగ్య రంగానికి 1.4% నుండి 1.8% మాత్రమే ఖర్చు చేస్తోంది.

జాతీయ ఆరోగ్య విధానం (NHP 2017) ప్రకారం 2025 నాటికి ఆరోగ్య రంగానికి చేసే ఖర్చును 2.5% కి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా, ప్రస్తుతానికి ఆ లక్ష్యం ఇంకా పూర్తిస్థాయిలో నెరవేరలేదు. ఈ క్రమంలో విద్యకు కనీసం 6 శాతం, వైద్యానికి కనీసం 3 శాతం కేటాయిస్తేనే నాణ్యమైన సేవలు సాధ్యమవుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.. అలాగే ఆరోగ్య రంగానికి బ్రెజిల్ తమ దేశ జీడీపీలో దాదాపు 10% ఖర్చు చేస్తుందని, సౌత్ ఆఫ్రికా వైద్యానికి 9%, విద్యకు 6% పైగా ఖర్చు చేస్తుందని, చైనా తమ ఆరోగ్య రంగానికి దాదాపు 6% కేటాయిస్తుందని వివరిస్తున్నారు..

అయితే మనదేశంలో ఈ విధానం అమలు కాకపోవడానికి ఉన్న అడ్డంకుల గురించి కూడా వారు తెలియచేస్తున్నారు.. ఇందులో స్వల్పకాలిక రాజకీయం ప్రధానంగా కనిపిస్తుంది... ఐదేళ్లు పాలించే నాయకుల కళ్ళకు దశాబ్దాలు పట్టే స్కూళ్లు, హాస్పిటళ్ల నిర్మాణం కంటే, తక్షణమే నగదు బదిలీలు చేయడం లేదా ఉచిత వస్తువులు పంచడమే సులువైన దారిగా కనిపిస్తుందని అంటున్నారు..

మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రుల ఒత్తిడి వల్ల ప్రభుత్వ రంగాలను బలోపేతం చేయడంపై నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని.. అదీగాక వీరి నుండి పార్టీ ఫండ్ రూపంలో నిధులు అందుతాయనే ఆరోపణలున్నట్టు చెబుతున్నారు.. అలాగే మన నేతల్లో నెలకొన్న అవినీతి, రాష్ట్ర అభివృద్ధితో పాటు.. పేదల అవసరాలకు పెద్ద అడ్డంకిగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

ఇదేకాకుండా నిధుల దుర్వినియోగం. కేటాయించిన అరకొర బడ్జెట్ కూడా సరైన నిర్వహణ లేక, అవినీతి నేతల వల్ల ప్రజలకు చేరడం లేదని.. ఈ అడ్డంకులన్నీ తొలిగితే నాయకులు ఇచ్చే ఉచిత వైద్యం, విద్య సాధ్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.. మరోవైపు ఉచిత విద్య, వైద్యాన్ని కేవలం ఎన్నికల వాగ్దానాలుగా కాకుండా రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులుగా మార్చాలి. ప్రభుత్వం మారినా ఇవి మారనటువంటి స్థిరమైన విధానాన్ని తీసుకురావాలని సూచిస్తున్నారు..

ఇక అన్నింటికంటే ముఖ్యం ప్రజా చైతన్యం. తాత్కాలికంగా ఇచ్చే నగదు పంపిణీలకు లొంగిపోకుండా, నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించే నాయకులనే ఎన్నుకుంటామని ప్రజలు గట్టిగా నిలబడినప్పుడే ఈ మార్పు సాధ్యమవుతుందని పేర్కొంటున్న నిపుణులు.. విద్య, వైద్యం అనేవి ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కాదు... మన దేశ మానవ వనరులపై చేసే అత్యుత్తమ పెట్టుబడి.. కానీ ఇవన్నీ జరగాలంటే ప్రజలతో పాటు.. రాజకీయానాయకుల్లో కూడా మార్పు రావాలి.. ప్రజా సేవ పేరుతో అడ్డగోలు దోపిడీకి.. పదవులు లేకున్నా అనుభవిస్తున్న రాజభోగాలు, సబ్సిడీలు ఇవ్వన్నీ వదులుకోవలసి వస్తుందని అంటున్నారు..

ఇదేకాకుండా.. కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లలో ప్రజాప్రతినిధుల (MP,MLA,MLC) జీతాలు, భత్యాలు, పెన్షన్లు, ఇతర సేవల కోసం ఏటా వందల కోట్లు ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.. ఒక్క రాజ్యసభ సభ్యుల జీతభత్యాలు, విమాన, రైలు ప్రయాణాలు, వైద్య బిల్లుల కోసమే ఏడాదికి సుమారు 163 కోట్లకు పైగా ఖర్చవుతోందని, అలాగే లోక్‌సభ ఎంపీల జీతాలు, ఇతర వసతుల కోసం ఏడాదికి సుమారు 250 కోట్ల నుండి 300 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల జీతాలు, పెన్షన్ల కోసం అన్ని రాష్ట్రాల బడ్జెట్లు కలిపి ఏటా సుమారు 800 కోట్ల నుండి 1,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని కొన్ని నివేదికలు అంచనా వేశాయి..

మరి ఇదంతా ఎవరి సొమ్ము?.. మాటలతో కోటలు కడుతూ.. ఆ కోటలకు ప్రజలే రాజులని మభ్యపెడుతున్న రాజకీయ నాయకులకు ఇదంతా తెలియదా అంటే.. తెలుసు కానీ వారికి పదవులు, డబ్బు, పలుకుబడి కావాలి.. నిజమైన ప్రజా సేవ చేస్తే ఏం మిగులుతుంది. అందుకే వారి పెట్టుబడి మాటలు..

ఆ మాటలతోనే రాజకీయం చేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.. వాళ్ళ కోసం కేటాయించే బడ్జెట్ లో ఆఫ్ వంతు ప్రజలకోసం కేటాయించిన నేడు ఉచిత విద్య వైద్యం కోసం ఇంతలా అడుక్కోవలసిన అవసరం ఏర్పడేది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. పన్నులు + ప్రభుత్వ పెట్టుబడి + బలమైన పబ్లిక్ సిస్టమ్ లేని చోట వట్టి మాటల దిబ్బలే మిగులుతాయని అంటున్నారు.. అందుకే భారత్ అన్నీ వనరులు ఉన్న దేశమైన.. ఇప్పటికీ వెనబడిన దేశంగానే చెప్పుకోవడానికి ఇవే కారణాలని పేర్కొంటున్నారు..

#India#political game#free#education#healthcare#country#Promises
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి